నవ్యాంధ్ర ప్రదేశ్ కు కేంద్రం నుంచి రావలసిన ప్రత్యేక హోదా పై గడిచిన రెండున్నరేళ్ల కాలంలో టీడీపీ ఎలాంటి వైఖరీని అవలంభిస్తుందో ఇదే పరిస్థితిని తాజా పార్లమెంట్ లో గమనించాం. రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో తెలుగు దేశం పార్టీ ఎంపీలు గట్టిగా డిమాండ్ చేయలేకపోయారు. గత రెండేళ్ల కాలంగా మిత్ర పక్షంగా ఉంటున్న బీజేపీ ఇప్పటికిప్పుడే ఎందుకు యుద్దం ప్రకటించాలనుకున్నారో తెలియదు కానీ... శుక్రవారం పార్లమెంట్ లో ప్రత్యేక హోదా బిల్లుపై దాదాపుగా 12 పార్టీలకు చెందిన 24 మంది సభ్యులు సభలో చర్చించారు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అయినా కేంద్రం మాత్రం చేతులెత్తేసింది. రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా చేసుకొని పాత పాటేనే పాడింది. హోదా పై ఎలాంటి ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కంటి తడుపుమాటగా హోదా అంశాన్ని పరిశీలిస్తాం అంటూ గతంలో చెప్పిన మాటలనే మరోమారు సభాముఖంగా ప్రకటించారు.
కేంద్ర వైఖరీ పై చంద్రబాబు వివరణ
ఇంత జరిగినా ఏపీ టీడీపీ మాత్రం హోదాను సాధించుకోలేకపోయారు. పోగా దీనిపై చంద్రబాబు ఓ వివరణ కూడా ఇచ్చుకున్నారండోయ్. అది ఎలా ఉందో చూద్దాం.... ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది. కేంద్రంలో భాగస్వా ములమయ్యాం కాబట్టే... గట్టిగా అడగలేకపోతున్నాం, విభజన చట్టంలో ఉన్నవి చెయ్యండి, మిగతా వాటి గురించి అడగడం లేదు, అడగను కూడా. కాంగ్రెస్ , అన్యాయం చేసింది. బీజేపీ కూడా అన్యాయం చేస్తామంటే ఎలా? మీడియా కు సైతం బాధ్యత ఉంది, ఏం చేయాలో ఆలోచించండీ. నేను ఏం చేసినా, ఆంధ్రప్రదేశ్ కోసమే. నేను మాట తప్పను, మడమ తిప్పను. ఏం చేయాలో ఆలోచించుకుంటాం. రాష్ట్రానికి సాయం చేసే విషయంలో కేంద్రం ప్రభుత్వం వైఖరి సరిగాలేదన్నారు. రాజ్యసభో 12 పార్టీలు మద్దతిచ్చినా న్యాయం చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. 14 వ అర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు లింకు పెట్టడం ఏమిటన్నారు.
చంద్రబాబు పాడిన పాటే పాడారు...
5 ఏళ్ల కోసారి ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులు కేటాయింపు చేస్తుందని, దానికి రాష్ట్ర విభజనతో సంబంధం లేదని చెప్పారు. ఆర్థిక మంత్రి ఏపీకి రూ. 1,69,965 కోట్లిచ్చినట్లు చెబుతున్నారని, అన్ని రాష్ట్రాలతో పాటే రాష్ట్రానికి కూడా ఇచ్చారని, ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదని తెలిపారు. తమకు అనుకూలంగా చేయాలని ఏమీ కోరడం లేదని, న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నానన్నారు. ఇదీ చంద్రబాబు మాట్లల్లోని సారాంశం. ఇందులో కొత్తగా చంద్రబాబు ఏమన్నా చెప్పారా? రాజ్యసభ లో అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా అంశాన్ని తుంగలో తొక్కి పాడిందే పాటరా అన్నట్లు పనికి మాలిన వ్యాఖ్యలు ఎలాగైతే చేస్తారో చంద్రబాబు అదే మాట్లాడారు. అంతకు మించి ఆయన వ్యాఖ్యల్లో కొత్త దనం ఏమీ లేదు. అయితే చంద్రబాబు గడిచిన రెండేళ్ల కాలంలో కేంద్రాన్ని సాయం చేయాలని కోరినట్లు తెలిపారు. ఆయన 10 సార్లు ఢిల్లీకి వెళ్లిన సంగతి వాస్తవమే కానీ ఆయన ప్రత్యేక హోదా పై అడిగారా లేదా అన్నదే ప్రశ్న.
కేంద్రంతో చర్చించి పరిష్కరించేంత ఛరిష్మా బాబు లేదని కాదు..
కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రం ప్రత్యేకహోదా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారన్నది నిర్వివాదాంశం. గతంలో ఆరు సూత్రాల ఆధారంగా ఏపీ ని విభజించవచ్చని అటార్నీ జనరల్ సలహా ఇచ్చారు. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో సీట్లు పెంచేందుకు చట్ట సవరణ కావాలని అడిగితే... ఈ సూత్రం ఆధారంగానే కాదంటున్నారు. పెద్ద మనషులు కూర్చుని రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాలి, అవసరమైతే 5 గురితో ఓ కమిటి వేయాల్సి ఉంటుంది. ఈ పరిష్కార సరళికి చంద్రబాబు తెలియనిది కాదు. దీని పై కేంద్రంతో చర్చించి ఆయన ప్రత్యేక హోదా సమస్యను పరిష్కరించేంత ఛరిష్మా లేదని కాదు. కానీ చంద్రబాబు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహారిస్తున్నారు. ఆయన ఈ విషయాలను చెబుతూనే ఆచరణలో మాత్రం చూపడంలేదు. ఇకపోతే తాజా పరిణామాల తో చంద్రబాబులో కొంత వరకు మార్పు వచ్చిందా అన్నది అర్ధం కానీ పరిస్థితి.
కేంద్రం సాయం పై బాబు క్లారిటీ ఇచ్చారు..
అయితే చంద్రబాబు మాత్రం కేంద్రం నుంచి వచ్చిన నిధుల విషయంలో కొంత వరకు క్లారిటీ ఇచ్చారు. కేంద్ర విద్యా సంస్థల ప్రహరీ గోడల నిర్మాణానికి తామే డబ్బులు ఇచ్చామని, గన్నవరం విమానాశ్రయానికి కేంద్రం కేవలం రూ. 200 కోట్టేల ఇచ్చిందని. తాము ఎంతో విలువైన భూములను ఇచ్చామని చెప్పారు. జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు రూ.850 కోట్లే ఇచ్చారన్నారు. రెండేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్న ఈ ప్రాజెక్టు ఇలా అయితే ఎప్పటికీ పూర్తవుతుందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన పారిశ్రామనిక రాయితీలు ఉపయోగించుకునే పరిస్థితి లేదని, వాటి వల్ల తమకు వచ్చే లాభం ఏమీ లేదని తెలిపారు. రాజధానికి రూ. 2,050 కోట్లు ఇచ్చామంటున్నారని, అందులో వెయ్యి కోట్లు విజయవాడ, గుంటూర్ కు ఇచ్చారని తెలిపారు. కేంద్రం పై ఇన్ని ప్రశ్నలు సంధించిన చంద్రబాబు చివరకు దీనికి రాజకీయ కుట్రగా చూడొద్దని, ఇదీ కేవలం రాష్ట్రానికి జరిగిన అన్యాయంగా నే చూడాలని తెలిపారు.
కేంద్రానికి బాబు ఉచిత సలహా...
అంతేకాదు కేంద్రానికి ఓ ఉచిత సలహా కూడా విసిరారు. ఇప్పటి వరకు ఏదో చేస్తారనే ఆశ ఉండేదని శుక్రవారం జరిగిన పరిణామాలతో అది కూడా పోయిందన్నారు. ఈ ఇష్యూ పై అఖిల పక్షం వేస్తారో, వేరే కమిటీ వేస్తారో వేసి కేంద్రం తమకు న్యాయం చేయాలన్నారు. అయినా తాను తొందరపడనని , రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓప్పిగా ఉంటానన్నారు. అంతేకాదు మేము ఎన్టీఏ కూటమి కాదని, కేవలం పార్టీలుగా సహకరించుకుంటున్నామని చెప్పారు. అయితే నాకొచ్చిన అపవాదు ఎందుకు ఒక్కరినే భరించాలనుకున్నాడో తెలియదుకానీ కాంగ్రెస్ పార్టీ విరుచుకు పడే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిన మొదటి రెండు రోజులు హడావుడి చేసి చర్చ జరిగేటప్పుడు బయటకు వెళ్లి పోవడం దారుణమన్నారు. ఒక్క నిమిషంలో వాకౌట్ చేసి ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు.
బీజేపీ తో పొత్తు పై క్లారిటీ ఇవ్వలేదు..
రాజకీయాల్లో నిప్పులాంటోడొనింటారు. కానీ ఆయన పాలన పూర్తిగా అవినీతిమయమేనన్న విమర్శలు మూట గట్టుకుంటారు. ఒకవైపు విభజించి కాంగ్రెస్ పాపం చేసిందంటారు, మరోవైపు విభజనకు మద్దతిచ్చింది తామేనని చెబుతారు. ఇక్కడ కొసమెరుపు ఎంటంటే... ప్రత్యేక హోదా ఇవ్వని, ఆంధ్రప్రదేశ్ విషయంలో సానుకూలంగా స్పదించని భారతీయ జనతా పార్టీతో ఇంకా అంటగట్టుకూనే ఉంటారా? అన్న ప్రశ్నకు మాత్రం చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. దటీజ్ చంద్రబాబు.