రాష్ట్రంలో ఊహించని పరిణామం గానీ, అనుకోని సంఘటన చోటుచేసుకుంటే ముఖ్యమంత్రి గానీ, సంబంధిత మంత్రి స్పందిచడం సహజం. ఆ సంఘటనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోలీసుల చాకచక్యత, జరుగుతున్న దర్యాప్తు ను వివరిస్తారు. కానీ తాజాగా తెలంగాణ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం విషయంలో ఇంత వరకు ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటి వరకూ తెలంగాణ సీఎం కేసీఆర్ గానీ, హోంమంత్రి గానీ, అత్యున్నత పోలీసు అధికారులు ఎవరూ మాట్లాడింది లేదు. కానీ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మాత్రం కొంత వరకు స్పందిచారు. నయీం విషయంలో ఎవరు మాట్లాడవద్దని, పోలీసులు నిజా నిజాలు నిగ్గు తేలుస్తారని, నయీం విషయంలో దోషులు ఎవ్వరిని ఉపేక్షించేలేదని తెలిపారు.
కరుడు గట్టిన నేరస్థుడు నయీం హతం...
ఇక గ్యాంగ్ స్టర్ నయీం చిన్న చితకా వ్యక్తి కాదన్నది అందరికి తెలిసిందే. అంతేకాదు.. తాజాగా సిట్ ధర్యాప్తులో వెలుగు లోకి వస్తున్న పరిణామాలు చూస్తే ఇట్టే అర్దమవుతుంది. అయితే ఇంత పెద్ద కరుడు గట్టిన నేరస్థుడు పోలీసుల చేతులో హతం కావడం ఈ సమాజానికి మంచిదే. అయినా ఈ విషయం పై తెలంగాణ అదికార పార్టీ నాయకులు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. దర్యాప్తు విషయంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో స్పందించడం లేదు. ఇకపోతే... తాజాగా ఈ విషయంపై గులాబీ నేత, సీఎం కే చంద్రశేఖర్ రావు స్పందించినట్టే నన్న అనుమానం రాకమానదు.
నయీం ఇష్యూ పై కేసీఆర్ ఘాటు స్పందన...
70 స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా గోల్కొండ కోట మీద నుంచి ప్రసంగించిన కేసీఆర్... గ్యాంగ్ స్టర్ నయీం విషయం పై తొలి సారిగా పెదవి విప్పారు. నేరుగా ప్రస్తావించని ఆయన.... ఈ అంశంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అరాచక శక్తుల ఆట కట్టిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణకు కృత నిశ్చయంతో దృఢ చిత్తంతో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితాలు కళ్లముందే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పోలీసుల పని తీరు ఎంతో మెరుగు పడిందని చెప్పటానికి సంతోషిస్తునామన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను అరికట్టటానికి మన పోలీసులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు యావత్ తెలంగాణ జాతీ గర్విస్తోందన్నారు.
ఇలా దాదాపుగా నయీం ఇష్యూ పై కేసీఆర్ స్పందించారనే చెప్పక తప్పదు. దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది? నయీంతో సంబంధాలు ఉన్నవారి విషయంలో తమ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్న విషయం కేసీఆర్ తన మాటలతో స్పష్టం చేశారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో నయీం విషయం పై స్పందించకున్న ఆయన మాట్లాడిన మాటల్లో సారాంశం మాత్రం ముమ్మాటికి నయీం ఇష్యూ పైనే నని చెప్పక తప్పదు.