గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. గత 20 ఏళ్లుగా ఎన్నడు లేని విధంగా వరుసగా కురిసిన వానలతో తెలంగాణ లో కొంతవరకు నష్టం కలిగించినా... రానున్న రెండేళ్ల వరకు నీటి ఎద్దటి లేకుండా పోయింది. అయితే ఈ క్రమంలో మిడ్ మానేరు డ్యాంకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఈ రోజు కరీంనగర్ అధికారులతో సమీక్షించారు. వరదల తలెత్తే పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొవాని... ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో కేసీఆర్ మధ్య మానేరు డ్యాం లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. సుమారు మధ్య మానేరు డ్యాం ను పూర్తి స్థాయిలో కలియ తిరిగి పరిస్థితులను గమనించారు. అంతేకాకుండా కరీంనగర్ ప్రాంతాలను సైతం ఆయన పరశీలించారు. ఆయన వెంట మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఏంపీ వినోద్, కలెక్టర్ నీతూ కుమార్ లు ఉన్నారు. అంతకు ముందు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను సమర్ధ వంతంగా ఎదుర్కొంటునే. ఈ అనుభవాలను భవిష్యత్ లో అనర్ధాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
మిడ్ మానేరు డ్యాం కు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతోనే ఈ అనర్ధం జరిగిందన్నారు. దశాబ్ద కాలంగా ఎంఎండీ పనులు జాప్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. పనుల్లో జాప్యం చేసిన వర్కింగ్ ఏజెన్సీల కాంట్రాక్టు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించారు. మిడ్ మానేరు ఆనకట్ట 130 మీటర్ల దెబ్బతిన్నదని ...ఇక పై నుంచి వరద వచ్చినా పెద్దా నష్టం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక పై ప్రమాదం ఉండదు కాబట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించిన గ్రామస్థులను తిరిగి తీసుకురావాలని సీఎ చెప్పారు. వర్కింగ్ ఏజెన్సీ లు తమకు అప్పగించిన పనులు సకాలంలో జరిగేటట్లు అవసరమైన నిబంధనలు రూపొందించాలన్నారు.
రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులు చేస్తున్నందున పనుల్లో వేగం అవసరమన్నారు. 123 జీవో మంచి పరిహారం ఇస్తున్నందున భూసేకరణ/కొనుగోలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్మానేరు కీలకమైనది కాబట్టి దాని పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. గోదావరి వరదల నేపథ్యంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరంగల్ జిల్లా రామన్నగూడెం, ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టుల వద్ద పెరుగుతున్న ఇన్ఫ్లోకు అనుగూణంగా ఔట్ఫ్లో పెంచాలన్నారు. ఎల్ఎండీ నుంచి విడుదలయ్యే నీరు ఖమ్మం, నల్లగొండ జిల్లాల దాకా చేర్చాలని సీఎం ఆదేశించారు.
ఇంతకన్నా తక్కువ వర్షపాతం, తక్కువ వరదలు వచ్చిన సందర్భాల్లో కూడా వందలాది చెరువు కట్టలు తెగిపోయిన సందర్భాలున్నాయన్నారు. మిషన్ కాకతీయకు ప్రశంసలు వస్తున్నాయని సీఎం చెప్పారు. వర్షాలు, వరదల వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవాలని, ముఖ్యంగా పశువులు, మనుషుల ప్రాణాలకు కాపాడటానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. జరిగిన నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు, ఇండ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.