ఢిల్లీలో నిర్భయ గ్యాంగ్ రేప్, అమృతసర్ లో కాలేజ్ నుండి తిరిగి వస్తున్న ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం, హైదరాబాద్ లో మెహిదీపట్నం నుండి బంజారహిల్స్ ఆటోలో ఎక్కిన ఓ యువతి పై జరిగిన అత్యాచారాలను మరవకముందే...   తాజాగా ఓ బిటెక్ విద్యార్థినిపై జిమ్ యజమాని హైదరాబాదులోని ఎల్బీ నగర్‌లో ఆదివారం అత్యాచారం చేశాడు. 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని ఎల్బీనగర్‌లోని భవానీనగర్‌లో ఉంటోంది. నిందితుడు ప్రశాంత్ రెడ్డితో ఆమెకు పాత పరిచయం ఉంది. ఆదివారం సాయంత్రం ప్రశాంత్ రెడ్డి అమ్మాయిని ఎల్బీనగర్ బాలాజీనగర్‌లో గల తన ఇంటికి పిలిచాడు. తన జిమ్‌లో సాధన చేస్తున్న ఆమె బాయ్‌ఫ్రెండ్ గురించి ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్తానని అతను ఆమెను తన ఇంటికి పిలిచాడు. దాంతో ఆమె అతని ఇంటికి వెళ్లింది. ఇంట్లో ప్రశాంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఆమె ఇంట్లోకి రాగానే ప్రధాన ద్వారం బోల్ట్ పెట్టేసి ఆ విద్యార్థినిపై అత్యాచారానికి దిగాడు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని ప్రశాంత్ రెడ్డి బాధితురాలిని బెదిరించాడు. ప్రశాంత్ రెడ్డిపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: