వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసులతో పాటు పదవులకు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ విచారణ ఖైదీగా చంచల్గుడా జైలులో ఉన్నారు. తాజాగా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు రాజీనామాలు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ముగ్గురు మంత్రుల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వివాదాస్పద జీవోలు జారీ చేసిన మరో ముగ్గురు మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణ కూడా రాజీనామాలు చేయాల్సి రావచ్చుననే వార్తలొస్తున్నాయి. అయితే, ఇప్పుడే వారి చేత రాజీనామాలు చేయిస్తారా, సిబిఐ చార్జిషీట్లు జారీ తర్వాత చేయిస్తారా అనేది తేలాల్సి ఉంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మరో ఐదు చార్జిషీట్లను దాఖలు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ ఐదు చార్జిషీట్లలో ఆ ముగ్గురు మంత్రుల పేర్లను నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీంతో సీఎం అప్పటివరకు వేచి చూస్తారా లేదా ఇద్దరితో పాటు వారిచేతా రాజీనామాలు చేయిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.
అవినీతి ఆరోపణల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ వీలైనంత త్వరలో వారిపై నిర్ణయం తీసుకోవాలని సిఎంకి సూచించినట్లు సమాచారం. అందుకే సీఎం ఎంత నచ్చజెప్పినా సబిత, ధర్మానలను మంత్రులుగా కొనసాగించరాదనే అభిప్రాయపడింది. ఆ సూచన మేరకే సిఎం వారిచేత రిజైన్ చేయించారు. దీంతో ఈ సూత్రం ఈ ముగ్గురికీ వర్తించే అవకాశముంది. సిబిఐ ఛార్జ్ షీట్ వరకు వేచి చూసి అప్పుడు చేయించే కంటే ముందే వాళ్లను సాగనంపే అవకాశమూ ఉంది. స్థానిక ఎన్నికల నోటిఫికేశష్ వచ్చేలోగా వారిని తొలగించడంమో.. లేదా గౌరవంగా వాళ్లనే రాజీనామాలు చేయమని కోరడమో జరుగుతుంది.