యూపీలో సమాజ్ వాదీ పార్టీలో రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులు సాగిపోతున్నాయి. ఇక పార్టీలో చీలిక తప్పదన్న అభిప్రాయానికి వచ్చి నాయకులు సైకిల్ గుర్తును దక్కించుకునే పనుల్లో నిన్నటివరకూ బిజీబిగా ఉన్నారు. ఆ గుర్తు తమకే చెందాలంటూ పోటీలుపడి ఈసీని కలిశారు. విజ్ఞప్తులు చేశారు. తీరా చూస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
సోమవారం రాత్రి ఉన్నట్టుండి.. ములాయం సింగ్ యాదవ్ ఓ సంచలన ప్రకటన చేశారు. దీని ప్రకారం చూస్తే.. సమాజ్ వాదీ పార్టీలో ముసలం సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ ఐక్యంగా ఉందనీ... అఖిలేశ్ యాదవే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ములాయం సింగ్ ఏఎన్ ఐ వార్తా సంస్థతో చెప్పారు. నేతాజీ ప్రకటనతో కొన్ని రోజులుగా పార్టీలోని అంతర్ యుద్ధానికి తెరపడినట్టు కనిపిస్తోంది.
యూపీలో జరగనున్న ఎన్నికలకు త్వరలోనే ప్రచారాన్ని ప్రారంభిస్తామన్న ములాయం.. తామే విజయం సాధించి మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ చీలిపోయే ప్రసక్తే లేదని.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అఖిలేశ్ యాదవేనని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ములాయం ప్రకటనతో సీన్ ఒక్కసారిగా మారిపోయినట్టయింది.
మరి తండ్రీ కొడుకులు రాజీకి వచ్చారా.. ఇంతటితో వివాదం సమసిపోయినట్టేనా.. లేక.. అఖిలేశ్ పై తన ఆధిపత్యం నిరూపించుకునేందుకు తానే సీఎం అభ్యర్థిని ప్రకటించినట్టు ములాయం కలరింగ్ ఇస్తున్నారా అన్నది కాస్త ఆగితే కానీ చెప్పలేం. రోజుకోరకంగా మారిపోతున్న సమాజ్ వాదీ రాజకీయాలు మాత్రం సగటు ఓటరుకు చిరాకు తెప్పిస్తున్నాయి.