తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టు కార్మికులు తమ జీతాలు పెంచాలని నిరసన తెలిపారు. సాక్షాత్తు ఏడుకొండల స్వామి వద్ద పని చేసేవాడికే…జీవిత కష్టాలు తప్పడం లేదని వారు ఉద్యమించారు. పద్మావతి నగర్లోని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని సీఐటీయూ ఆధ్వర్యంలో టీటీడీ కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. నెల జీతం పెంచాలని, లేబర్ యాక్ట్ ప్రకారం కనీసం రూ.18 వేల జీతం ఇవ్వాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గత కొంత కాలంగా ఆలయంలో పనిచేస్తున్న తమకు వేతనం సరిపోవడం లేదని తాము ఎన్నో కష్టాల్లో ఉన్నామని నిత్యావసర వస్తువుల రేట్లు భగ్గుమంటున్నాయని తమకు ఇచ్చే అత్తెసర జీతాలు సరిపోవడం లేదని అందుకోసం తమ నిరసన తెలుపుతున్నామని అంటున్నారు.
కార్మికులు ఆందోళన చేస్తున్న సమయంలో టీటీడీ చైర్మన్, నాయుడుపేటలో జరుగుతున్న సీఎం సభలో ఉన్నారు. దీంతో అక్కడివారు ఫోన్లో టీటీడీ చైర్మన్తో మాట్లాడించడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన విరమించారు.