ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో పలుసార్లు ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇండియాను భరతమాత అని పిలవడంలోనూ.. వందేమాతర గీతం విషయంలోనూ.. అనేక సార్లు అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మహాత్మాగాంధీని విమర్శించారు.
జాతిపిత మహాత్మాగాంధీ కన్నా డాక్టర్ బీఆర్ అంబేద్కరే గొప్పవారన్నారని కామెంట్ చేశారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. అంబేద్కర్ వల్లే వర్గ రహిత, లౌకికవాద రాజ్యాంగం సాధ్యపడిందని అసదుద్దీన్ కామెంట్ చేశారు. దీనివల్ల సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరిందని అసదుద్దీన్ అంటున్నారు.
ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఉనికి చాటుకున్న ఎంఐఎంను ఉత్తర్ ప్రదేశ్ లోనూ అభివృద్ధి చేయాలని అసదుద్దీన్ ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకు యూపీ ఎన్నికలను అవకాశంగా మలచుకుంటున్నారు. అక్కడ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎంను పోటీకి దింపుతున్నారు అసదుద్దీన్ ఒవైసీ.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే ఆయన ఈ వివాదాస్పద కామెంట్లు చేశారు. సంభాల్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘అంబేద్కర్ మహాత్మాగాంధీ కన్నా పెద్ద నాయకుడు. ఆయన లౌకికవాద, వర్గ రహిత రాజ్యాంగం రూపొందించి ఉండకుంటే సమాజంలో అన్యాయాలు మరింత పెరిగిపోయావి. ఆరెస్సెస్ పరిస్థితులను మరింత దారుణంగా మార్చేది అంటూ మండిపడ్డారు ఒవైసీ.