ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. నిడమర్రు, లింగాయపాలెం ప్రాంతాల్లో ఆయన రైతులతో మాట్లాడి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అయితే.. కురగల్లులో కొంతమంది రైతులు.. జగన్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. జగన్ గో బ్యాక్ అంటూ బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేశారు. రైతుల్లో విషబీజాలు నాటేందుకే జగన్ పర్యటిస్తున్నారని కొంతమంది రైతులు ఆరోపించారు. ఎర్రబాలెం గ్రామంలోనూ ఇదే తరహా బ్యానర్లతో రైతులు, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వెంటనే బ్యానర్లు లాక్కొని రైతులను అక్కడి నుంచి పంపించేశారు. రైతుల నిరసనల మధ్య జగన్ పర్యటన కొనసాగించారు.
రైతులతో మాట్లాడిన జగన్.. ప్రభుత్వం కమీషన్ల కోసమే రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టిందని, భూ సేకరణ పేరుతో రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. రూ.15 కోట్లు పలికే ఎకరం భూమికి కేవలం 30 లక్షలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.