ఈ మధ్య పెద్దనోట్ల రద్ధు తరవాత "సామాన్యుడు" పై రాజకీయ నాయకులు జాలి చూపులు రువ్వుతున్నారు. పేదవాళ్ళందరిపై దయ కనికరం చూపిస్తున్నారు. ప్రజలకు ముఖ్యంగా ఇప్పుడున్న సమస్య ప్రస్తుతం వరకు ఉన్న ఆర్ధిక అలవాట్లను మార్చుకోవలసి రావటం. “మార్పు” ని వెంటనే స్వీకరించటానికి మన మనస్సు అంగీకరించదు. దాన్ని బలవంతంగా నైనా అమలు జరపక పోతే మన జాతి పాలకులను క్షమించదు. అసలు ఎవరు సామాన్యుడు? ఎవరు సామాన్యుని పక్షం వహిస్తున్నారు? అని ప్రశ్నించుకుని పరిశీలిద్ధాం.
అసలు సామాన్యుడు ఎవరు?
బాంకులు వారానికి వ్యక్తిగత ఖాతాల నుండి ఇరవై నాలుగు వేల రూపాయలు ఉపసం-హరించుకునే అవకాశం ఇచ్చింది. అంటే నెలకు తొంబయ్యారు వేల రూపాయలు డ్రా చేసుకోవచ్చు (ధన సరపరా సమస్య కొద్ది రోజుల్లో తీరిపోతుంది) నిజంగా చూస్తే ఒక కుటుంబానికి తొంబయ్యారు వేలరూపాయలు నగదు తమ అవసరాలకు సరి పోదా? అదే చాలా యెక్కువ. అంతకంటే డబ్బు రూపములో ఖాతానుంచి ధనాన్ని నగదు రూపకంగా ఉపసం-హరించుకుంటే అంతా నల్లధనంగా మారినట్లే.
అవసరమైనంత మేర మాత్రమే నగదు రూపెణా ఆస్థి మనచేతిలో ఉండాలి. నగదెప్పుడూ చలామణీలో ఉండాలి. అందుకే భారతీయ సమాజం లక్ష్మిదేవిని చంచల మని వర్ణించారు. దాన్ని అలా చలామణీలో ఉంచకపోవటం నేరంగా భావించాలి. ధనలక్ష్మిని బందిచకూడదు. అది బాంక్ ఖాతాల్లో ఉంటే సమాజం నడవటానికి ఇందనంగా ఉంటుంది. ధనం ఇందనమే. ఆస్తులు నగదు రూపములో ఉంచుకుంటే ఉత్పత్తి, తయారీ, సేవలు, మేధోపర కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించాలి.
సామాన్యులే కాదు అసామాన్యులు సహితం తొంబయ్యారు వేల రూపాయిలు తమ ఖాతాల నుండి నగదు రూపకంగా ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగత అవసరాలకు ఐదు గురున్న కుటుంబానికి అంతకు మించి అవసరం ఉండదు. అంతకుమించి ఖర్చు చేసుకోవాలంటే క్రెడిట్, డెబిట్ కార్డులు, అంతర్జాలం ద్వారా, కాకుంటే బాంకింగ్ పద్దతులైన చెక్కుల ద్వారా, ఆర్.టి.జి.ఎస్, నెఫ్ట్, ఈ.సి.ఎస్ తదితర మార్గాల్లో సొమ్ము బదిలీ చేసుకోవచ్చు. బాంకుల మధ్య నగదు బదిలీకి "క్లియరింగ్" పద్దతి ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాంకుల క్యూలో నిలుచోవలసిన అవసరమేముంది. తెల్లధనం నల్లధనంగా మార్చేవరకు ఈ సామాన్యుల వెనుక ఉన్న అసామాన్యులు ఊర్కోలేరు కదా!
జనధన్ యోజన క్రింద తెరచిన తమ ఖాతాల్లో నల్ల సంపన్నుల డబ్బును దాచటానికి అనుమతిచ్చిన నిరుపేదలు క్షమార్హులా? వారి భవిష్యత్ కోసమే కదా మోడీ ప్రభుత్వం పార్టీని ఫణంగా పెట్టి చేసిన సాహసోపేత నిర్ణయానికి నిరుపేదలైన సామాన్యులు ఎందుకింత దుర్బలులౌతున్నారు. ఇరవైఒక్క వెల కోట్ల నల్లధనం వీరి కక్కుర్తికి తెల్లధనంగా మారింది. వారి ఖాతాలు, వారిని గుర్తించి వారికి లభించే సాంఘిక సంక్షేమ పధకాల క్రింద లభించే ప్రయోజనాలను చట్టభద్ధంగా నిరోధించే చట్టం వెంటనే చేయాలి. అదే జరగని నాడు సామాన్యుడు నేరస్తుడు అవటం జరుగుతుంది.
సామాన్యుడు – అసామాన్యుడు- అనన్యసామాన్యుడు
మమతా బెనెర్జీ సత్యసంధురాలా! అలా అయితే శారదా! నారదాల సంగతేమిటి? వాటి వెనకున్నది తృణమూల్ నాయకులే కదా! అరవింద్ ఖేజ్రివాల్ సంగతేమిటి? విదేశీ విరాళాల లోగుట్టేమిటి? ఆయన చర్యలను అన్నా హజారే సమర్దించగలరా? భారత కమ్యూనిష్టులని ముఖ్యంగా పశ్చిమబెంగాల్ లో సిపిఎం పాలన అవినీతి మయం కాదా! యూపీలో సమాజవాదీ, బిహార్ లో రాష్ట్రీయ జనతదళ్ లాలుప్రసాద్ నేరస్తులు గా ముద్ర పడ్డవాళ్ళే. ధనం దుర్వినియోగం చేయటంలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు దేశములోనే ప్రధములు. జయలలిత మరణం తరవాత తమిళనాడ్ లో జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడుల్లో పెద్ద పెద్ద తిమింగలాలే బయట పడుతున్నాయి. జయలలితను బూచిగా ఆమె నీడలో అనేక సంఘవిద్రోహ శక్తులే ఆర్ధికంగా సమాజమనే మహావృక్షానికి అల్లుకుపోయి జాతిని విద్వంసం చేయటంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే ముందున్నాడంటే ఆ రాష్ట్రములో ఆర్ధిక ఆరాచకం ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
కోటానుకోట్ల రూపాయీల నల్లధనం నల్లకుబేరుల విభిన్న వ్యూహాలతో కమీషన్లు ఇచ్చి కొందరు సంఘవిద్రోహుల సహాకారంతో తెల్లధనంగా బాంకింగ్, పోష్టల్ చానల్స్ ద్వారా మార్చేసుకుంటున్న వార్తలు అందుతున్నాయి. కొందరు పశ్చిమ బెంగాల్ లోని నల్లకుబేరులు జన్-ధన్ యోజన క్రింద ప్రారంభమైన నిరుపేదల ఖాతాలకు కిరాయి చెల్లిస్తూ ఏభైవేల రూపాయీల వరకు సం-రక్షించుకుంటున్నారు. కొందరు ఈశాన్యరాష్ట్రాల్లోని అమాయక ట్రైబలుసును మభ్యపెట్టి వారికున్న ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఈ నల్లనేరగాళ్ళు తమ ప్రయోజనానికి అనువుగా మార్చుకుంటున్నారు.
చార్టెర్డ్ విమానాల్లో, రైల్ కంటైనర్ల ద్వారా తమ నల్లధనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకుంటున్నారు. దీనికి సామాన్యుల సహకారం లేదంటారా? సామాన్యులు సుధీర్గ కాలములో తమని రక్షించే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వానికి సహకరించకుండా, కమీషన్లకు, లంచాలకు దేశ ప్రయోజనాలను బలి పెట్టటం దేశానికిగాని తమకిగాని ప్రయోజనం కాదని గ్రహిస్తే మంచిది. వీటివెనక నల్లనాయకులు, కుబేరులు లేరా?
ప్రతిపక్షాలు తమరాజకీయ ప్రయోజనాల నల్లధన రక్షణ దృష్ట్యా భారత్-బంద్ నిర్వహించే యోచనకూడా చేశాయి. మోడీ కోరినట్లు 31/12/2016 వరకు ఒకసారి సహ కరించి చూస్తే ఆ ప్రయత్నం మనదేశానికి మేలు జరగొచ్చు. తరవాత మోడీ చెప్పి నట్లు దేశానికి మేలు జరగక పోతే ఆ తరవాత ఆయనని సాధారణ రాజకీయ నాయకుల్లో ఒకడుగా జమ కట్టేద్ధాం. ఒకే ఒక్క అవకాశం సామాన్యుడు అసామాన్యుడై మోడీకి సహకారమివ్వటం వారికి భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తే మంచిది.
గాలి జనార్ధనరెడ్ది వందకోట్ల నల్లధనాన్ని కొత్త నోట్లతో మార్చుకోవటానికి డ్రైవర్ల తో సహా అనేకమంది సామాన్యులే సహకరించారు. ఎందుకంటే వీలుచిక్కితే తామూ అసామాన్యులమౌదామనే కదా! భారత సమాజం లో అవినీతి పునాదులు అనంతం. పుట్టుకతోనే అవినీతి బాట పట్టించే అవ్యవస్థ ఇక్కడ నెలకొని ఉంది. భారత్ ఎప్పట్నుంచో నేరస్తులకు అనువైన వాతావరణం కలిగి నేరాలు ప్రోత్సహించే సమాజంగా అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ప్రతివ్యక్తి గౌరవప్రదమైన జీవనం కంటే ఈజీ మనీకోసం వెంపర్లాడటం అవకాశం దొరకగానే దోచేసుకొనే అవకాశవాద నేర సంస్కృతి రోజురోజుకు ప్రబలిపోతోంది.
ఏకాంతం లోనే ఏ కాంత తో అయినా మన ప్రవర్తన మనలోని మనం బయటపడతాం. మన విధానం మన అసలు మనసు స్వరూపం తెలుస్తుంది. అధికారం ఇచ్చి చూస్తే ఒక వ్యక్తి దాహం తెలుస్తుంది. అవకాశం దొరికినప్పుడు ఒక మనిషి ఏవిధంగా ప్రవర్తిస్తాడనేదే అసలు వ్యక్తిత్వం. అలాగే సామాన్యునికి నేడు అవకాశం దొరికింది. అందుకే జన-ధన్ యోజన ఖాతాలు నల్లధనం తో పొంగి పొరలు తున్నాయి. ఇంకెక్కడ సామాన్యుడు? వానికీ అవకాశం దొరికింది. నల్ల కుబేరునితో జోడీ కట్టాడు. తన ఖాతాలు నల్లధనం తో నింపాడు సామాన్యుడు. అలాగే:
నవంబర్ 10 నుండి అవకాశం లభించినప్పుడు నల్లకుబేరుని సెవకోసం ఒక్కో లావాదేవీకి నాలుగు వందలు రూపాయలకు రూ.4000/- నల్లధనాన్ని తెల్లధనం చేశాడు. తన కోసం కేంద్రం ఇచ్చిన అవకాశం తో ప్రారంభించిన జన్-ధన్ యోజన ఖాతాలు నల్లకుబేరులకు కిరాయికిచ్చి 10% నుండి 25% కమీషన్లు పోంది మళ్ళా "నల్లధన నిర్మూలన యజ్ఞాం" అనే కార్యక్రమాన్ని "నల్లధన జన్మస్థానం" గా మార్చిన వాడూ సామాన్యుడే. అనేక సంధర్భాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా లభించే అవకాశాల్లో నల్ల కుబేరుని నల్లధనాన్ని తెల్లదనం చేసే దుర్మార్గ ప్రక్రియలో సామాన్యుడే సోమయాజి (వందలాది యజ్ఞాలు నిర్వహించినవారు) ఇక మోడీ అయినా, ఆ దేవుడైనా ఇంకెం చెయగలడు? మోడీ అన్నట్లు ప్రాణాలకు తెగించకపోయినా కొంతైనా తన ప్రయత్నం ప్రారంభించిన మోడీకి చేయూతనివ్వాల్సిన సామాన్యుడు "చెయ్యిచ్చాడు"
అసలు సామాన్యుని కోసం చేపట్టిన నల్లధన నిర్మూలన కోసం చేపట్టిన పెద్దనోట్లరద్ధు కార్యక్రమం పాక్షికవిజయం సాధించినదని చెప్పవచ్చు. నల్లధనాన్ని ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కంటెయినర్లలో తరలించటములో, రోడ్డు మార్గాల్లో దారిమళ్ళించటానికి సామాన్యుడే సహకరించాడు. సామాన్యుడు ప్రజావేగు గా మారి ఉంటే నల్లకుబేరుల తెల్లధనానికి మార్పిడి చేసిన ఇంత తతంగానికి వారనుసరించిన మార్గాలు వ్యవస్థలకు తెలియజేసి ఉండేవాడు. ఆ పని నాది కాదన్నట్లు నిశ్శబ్ధం గా ఉండిపోయాడు సామాన్యుడు.
పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు తమ ఆర్ధిక నేరాలతోనే ఆస్థాయికి చేరుకున్నారని వారిచరిత్రలే చెపుతున్నాయి. పన్నుల ఎగవేతలు, తెరచాటు లావాదేవీలు, విదేశమారక ద్రవ్య దుర్వినియోగం మనం రోజూ చూస్తూనే ఉన్నా ప్రజా వేగుగా వ్యవహరించే పాటి సామాన్యుడికి లేకుండా పోతుంది. ఒక వేళ ఎవరైనా ప్రవర్తిస్తే ప్రభుత్వములోని, ప్రభుత్వ వ్యవస్థల్లోని సంఘవిద్రోహ శక్తులు వేల పడగలతో వారిపై విషం చిమ్ముతుంటాయి. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్ధు పదకం ప్రకటించగానే రాజకీయనాయకులు, కాంట్రాక్టర్లు, పోలీసులు, బాంక్ ఉద్యోగులు, పోస్టల్, రైల్వె, ట్రాన్-స్పొర్ట్, పెట్రొల్-పుంప్స్ ఇవి ఉదాహరణకు మాత్రమే - వీటిలో దాగున్న నేరగాళ్ళు అవకాశం కోసం ఆవు రావురంటూనే ఉంటారు. అయితే సమస్య నేరగాళ్ళతో కాదు... వాటిని భరించి సహించే వాళ్ళతోనే. వీళ్ళ సహనమే దేశానికి చేసే కీడు అనంతం.
ఇంత పెద్ద 130 కోట్ల జనభారతంలో ఒక్క శాతం మాత్రమే పన్ను కట్టే వాళ్ళున్న సమాజం ఎలా అభివృద్దిలోకి వస్తుంది? ప్రతి వయోజనుడైన భారతీయునికి శాశ్వత పన్ను గుర్తింపుకార్డు ఉండే ఏర్పాటుచెయ్యాలి. సాంఘిక సంక్షేమఫలాలు అనుభవించే ప్రతి ఒక్కరి కి కూడా "పాన్" ఉండితీరాలి. నిరుపేద నిరుపేదగానే ఉండడు. సమాజాభి వృద్దితో పాటు ఎంతో కొంత నిరుపేదకూడా అభివృద్దిలోకి వస్తాడు. 0-5% అయినా ఆదాయ పన్ను చెల్లించే స్థితికి ప్రతి ఒక్క భారత పౌరుణ్ణి తీసుకురావాలి. నిరుపేద, సామాన్యుడని ఓట్ల కోసం వలపన్నే కుటిల రాజకీయ నాయకులకు సంఘ బహిష్కరణ శిక్ష విధించాల్సిన చట్టాలు చేయాలి. ఒక్కసారి తెల్లరేషన్ కార్డ్ పొందిన లేదా ఆరొగ్యశ్రీ కార్డ్ పొందిన వ్యక్తి దాన్ని జీవితాంతం అనుభవించే పరిస్థితిని తప్పించాలి. ఆ అవకాశం రెండేళ్ళ పాటు మాత్రమే అందించి, ఈ లోగా అతనిని ఆ పరిది నుంచి ఎదిగేలా చేయక పోతే ఆ వ్యక్తి సమాజానికి భారమౌతున్నట్లే.
ఏ క్యూలోను నల్లధనముతో పొటమరించిన కుబేరుడూ నిలబడలేదు. కారణం కమీషన్ తీసుకుని ఆ కుబేరుని అవసరాలు సామాన్యుడే క్యూలో నిలబడి తీర్చాడుకాబట్టి. అలాగే తాను సామాన్యునిగా క్యూలో ఉన్నా న్యాయం జరగలేదని గొంతెత్తి టెలి విజన్ గొట్టాల ముందు కేకలేసి ప్రభుత్వ సదాశయాన్ని ఎండగట్టటములో ముందున్నదీ సామాన్యుడే.