భారత్ 68వ గణతంత్రదినోత్సవం జరుపుకుంటోంది.. ఈ సందర్భంగా దేశమంతటా మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతోంది. ఇక రిపబ్లిక్ దినోత్సవ సంబరాల్లో దేశమంతా మూడు రంగుల్లో మునిగితేలడం సర్వసాధారణంగా జరిగేదే. కానీ ఈ ఏడాది ఓ అద్భుతం చోటు చేసుకుంది. విశ్వవినువీధిలో భారత పతాకం కనువిందు చేయబోతోంది.
ఔను.. ఈసారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనం మువ్వన్నెల కాంతులీనుతోంది. ఈ భవనం మొత్తాన్ని మన దేశ పతాక రంగుల బల్బులతో అలంకరించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ భవనం భారత త్రివర్ణ పతాకం రంగులతో మెరిసిపోతుంది. ఈ విషయాన్ని బుర్జ్ఖలీఫా నిర్వాహకులు అధికారికంగా ట్విట్టర్లో ప్రకటించారు.
ఈ రోజు రాత్రి భారత 68వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. భారత జాతీయ పతాకం తరహాలోనే బుర్జ్ ఖలీఫా భవనం మొత్తాన్ని ఎల్ఈడీ దీపాలతో అలంకరించి మెరిసేలా ఏర్పాట్లు చేశాం అని వారు ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి ఎన్నడూ లేనిది ఈ ఏడాదే ఎందుకు ఇలా మన రిపబ్లిక్ దినోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అనేగా మీ సందేహం.
దానికీ ఓ కారణం ఉంది. ఈ సారి రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా అబుదాబి ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ వస్తున్నాడు. అంతేకాదు.. యూఏఈ సైనికులు భారత సైనికులతో పాటు పరేడ్లో పాల్గొంటారు. అదీ సంగతి. ఇక ఈ బుర్జ్ ఖలీఫా విశేషాలేంటో చూస్తే.. ఇది దుబాయ్లో ఉంది. ఈ భవనం ఎత్తు 823 మీటర్లు. అంటే దాదాపు ఒక కిలోమీటర్ దూరం పైకి వెళ్లాలన్నమాట. యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ పేరు మీద ఈ భవనాన్ని నిర్మించారట.