జల్లికట్టు.. ఇటీవల ఫలించిన ప్రజాఉద్యమాల్లో ఇదొకటి. ఓ సంప్రదాయం కోసం ఓ రాష్ట్ర ప్రజలంతా మూకుమ్మడిగా నిరసనలు నిర్వహించడం బహుశా అరుదు. అందులోనూ చట్టవిరుద్దమైన క్రీడను కూడా జనం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తయారు చేయడం ఇంకా అరుదు. అలాంటి ఆర్డినెన్సును కేంద్రం ఆమోదించి రాష్ట్రపతితో ముద్రవేయించడం ఇంకా ఇంకా అరుదు.
అందుకే ఈ జల్లికట్టు ఉద్యమం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. ఆంధ్రాలో జల్లికట్టు పుణ్యమా అని ప్రత్యేక హోదా ఉద్యమం మరోసారి జోరందుకుంది. ఇప్పుడు ఆంధ్రాలోనే కాదు.. మరో రాష్ట్రంలోనూ మరో ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్రంలోని సంప్రదాయ క్రీడ కంబళపై కూడా ఇలాంటి ఆర్డినెన్సు తీసుకురావాలని అక్కడి ప్రజల నుంచి ఉద్యమం ప్రారంభమైంది.
జల్లికట్టు సమస్యను తమిళనాడు రాష్ట్ర పరిష్కరించిన తీరులోనే కన్నడ సంప్రదాయ క్రీడ కంబళపై నిషేధం ఎత్తివేయాలంటూ కర్ణాటకలో ఆందోళనలు తీవ్రమవుతున్నవేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జల్లికట్టుకు మార్గం సుగమం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం పయనించిన బాటలో వెళ్లి పరిస్థితి చేయిదాటకముందే సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది.
అసలు ఈ కంబళ అంటే ఏంటి.. ఈ క్రీడలో ఎద్దుల బళ్లను ఉరికిస్తూ ఆనందిస్తారు. పోటీలు కూడా నిర్వహిస్తారు. కోస్తా ప్రాంతంలోని ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో బురద మడుల్లో కంబళ పేరిట పశువుల పందేలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఎద్దులబళ్ల పోటీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ జంతుహింస నిరోధక చట్టాన్ని సవరించాలని కర్ణాటక మంత్రివర్గం తీర్మానించింది. చట్ట సవరణ బిల్లును ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టేస్తారట.