కెంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అసహనం అనుక్షణం పెరిగిపోతుంది. ఆయన ముద్దాయిగా ఆరోపించబడినా జగన్ ప్రతిపక్ష నాయ కుడే. ప్రజలచేత ఎన్నుకోబడ్డ నాయకుడు. ఆయన్ను ఒక శాసనసభ్యుడుగా, ప్రతిపక్ష నాయకునిగా గౌరవించలేని అసహనం ప్రభుత్వపక్షం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుండి చోటా గల్లి తెలుగుదేశం నాయకుడు వరకు ఆయన్ను విమర్శించే వాళ్ళే. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అనర్హుడైతే ఆయన్ని చట్టపరంగా అభిశంసించండి. ఆయన నేరాలను చూపిస్తూ మీర నేక నేరాలలో కూరుకు పోతున్నారు. మీ అసహనమే అన్నీ సమస్యలకు మూలం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పై లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఘాటుగా స్పందించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజల పట్ల అలసత్వం ప్రదర్శించటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటై పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్-వ్యూలో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తామని ఆరు నెలల కిత్రం వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సుజనా చౌధరి, వెంకయ్య నాయుడు తో సహా ఇతర కేంద్ర మంత్రులు చెప్పిన మాటలనే ఇప్పుడు రాష్ట్రంలో యువత, ప్రతిపక్షపార్టీ లు గుర్తు చేయడానికి పూనుకుంటే అది దేశద్రోహ చర్య ఎలా అవుతుందని జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. పాలకుల్లో ఇలాంటి అసహనం పెరగడం ఆంధ్రప్రదేశ్ కు దాని అభివృద్దికి భవిష్యత్ ఏ మాత్రం మంచిది కాదన్నారు.
విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డి, ఇద్దరు వైసిపి ఎంపిల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తే ఏమాత్రం ప్రజా స్వామికచర్య అనిపించుకోబోదన్నారు. తిమ్మిని బమ్మి చేసి ప్రజలను భ్రమింప జేసేందుకు టీడీపీ, బీజేపీ ప్రత్యేక హోదా నిర్వచనాన్ని మార్చి, పారిశ్రామిక రాయితీలు అందులో భాగం కానట్టు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సహాయానికి ప్యాకేజీ అన్న పేరు పెట్టడాన్ని ఆయన నాన్సెన్స్గా పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతో పన్ను రాయితీలు వస్తాయి. రాయితీలు వస్తే ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమల పెట్టుబడులు గణనీయంగా వచ్చే అవకాశం ఉంద న్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకే పారిశ్రామిక రాయితీలు దక్కాయని అన్నారు అధికారంలో ఉన్నవారికి నచ్చినా, నచ్చక పోయినా, ప్రజలు తమ కోరికకు అనుగుణంగా నిరసన తెలిపే హక్కు ఉంటుందని, రాష్ట్రంలో ఫలానాది జరిగితే బాగుండని, ఎవరూ పట్టించు కోవడం లేదని పదిమంది గుమికూడి నిరసన తెలపచ్చని అన్నారు.
"ప్రత్యేక హోదా కోసం అడిగితే అది దేశద్రోహం ఎలా అవుతుంది? ప్రత్యేక హోదా అవసరం లేదనుకుంటే శ్వేత పత్రం ప్రకటించి, పన్ను రాయితీ అవసరం లేదు, ప్యాకేజీ సరిపోతుందని చెప్పమనండి. నిన్నటిదాకా వాళ్లు చేసిన వాదన ఇప్పుడు అన్యాయమైపోయింది, అక్రమమైపోయింది. మాట ఇచ్చారు కాబట్టి అడుగుతున్నారు. ఇది తప్పు ఎలా అవుతుంది? అడిగేవారి గొంతు నొక్కడం విజ్ఞత కాదు. బలవంతంగా నోరు మూసే ప్రయత్నం చేస్తే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది కాని తగ్గదు" అని అన్నారు.
"రాష్ట్రానికి కేంద్రం పెద్దలు ఏయే హామీలు ఇచ్చారు? ఏవి జరిగాయి? ఏవి జరగలేదు? ఏం సాధించుకోవాలి? సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో? ప్రభుత్వం శ్వేతప్రతం రూపంలో చెప్పాలి. కానీ ఇదంతా జరగలేదు. ఇది ప్రైవేట్ వ్యవహారం కాదు. ప్రజల ముందు పెట్టాలి. ప్యాకేజీ అంటున్నారు. ఆ పదమే నాన్సెన్స్' అంటూ జయప్రకాశ్ నారాయణ ఘాటుగా స్పందించారు.