అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేస్తున్నారు. స్వదేశీయులకే ఉద్యోగాలన్న నినాదంతో గద్దెనెక్కిన ట్రంప్‌ తన నిర్ణయాలతో ఇటు విదేశీ ఎంప్లాయిస్‌ కు, అటు కంపెనీల సీఈవోలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అటు ఉద్యోగులను ఉంచలేక, ఇటు ట్రంప్‌ నిర్ణయానికి ఎదురు చెప్పలేక పలు కంపెనీలు కిందామీదా  పడుతున్నాయి.


ట్రంప్‌ నిర్ణయంతో ఇండియాకు చెందిన దిగ్గ‌జ ఐటీ కంపెనీల సీఈవోలు ఈ నెల‌లోనే అమెరికా వెళ్ల‌నున్నారు. హెచ్‌-1బీ వీసా నిబంధ‌న‌ల‌ను ట్రంప్ ప్ర‌భుత్వం క‌ఠిన‌త‌రం చేస్తున్న‌ద‌న్న వార్తల నేప‌థ్యంలో వాళ్లు ఉన్నపళంగా యూఎస్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇదే విష‌య‌మై ఫిబ్ర‌వరి 20 నుంచి ట్రంప్ ప్ర‌భుత్వంలోని అధికారులు, చ‌ట్ట ప్ర‌తినిధుల‌ను క‌లువ‌నున్న‌ట్లు నాస్కామ్ అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్ వెల్ల‌డించారు. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌లాంటి కంపెనీలు కూడా అమెరికా క్లైంట్ల‌తో ప‌నిచేయ‌డానికి విదేశీ నైపుణ్యంపైనే ఆధార‌ప‌డ‌తాయి. అయితే ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయ‌న్న ఉద్దేశంతో ట్రంప్ ప్ర‌భుత్వం వాటిని అరిక‌ట్ట‌డానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ త‌యారుచేస్తున్న‌ద‌న్న వార్త‌లు ఇండియ‌న్ టెక్ దిగ్గ‌జాల‌ను ఆందోళ‌న‌కు గురిచేశాయి. 

అదే జ‌రిగితే ఆపిల్‌లాంటి అమెరికా కంపెనీల‌తోపాటు విప్రోలాంటి ఇండియ‌న్ కంపెనీలు కూడా స్థానిక అమెరిక‌న్ల‌కే ఉద్యోగావకాశాలు క‌ల్పించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుంది. ఒక‌వేళ అమెరికా హెచ్‌-1బీ వీసా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తే వాళ్ల‌కు క‌లిగే న‌ష్టాల‌ను వివ‌రించాల‌ని అనుకుంటున్న‌ట్లు చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. వాషింగ్ట‌న్‌లో భార‌త్ సీఈవోల బృందం నాలుగు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నుంది.

 

 ఇప్ప‌టికే ఇదే విష‌య‌మై భార‌త ప్ర‌భుత్వంతో తాము చ‌ర్చించినా.. వ్యక్తిగ‌తంగానే ప్ర‌య‌త్నించాల‌ని అనుకుంటున్న‌ట్లు చంద్ర‌శేఖ‌ర్ చెప్పారు. ఇటు ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ సిద్ధ‌మవుతున్న స‌మ‌యంలోనే అటు కాంగ్రెస్ కూడా హెచ్‌-1బీ వీసా బిల్లుపై చ‌ర్చించ‌నుంది. ఈ అంశంపై జూన్‌లో ప్ర‌ధాని మోదీ, ట్రంప్ మ‌ధ్య జ‌రిగే స‌మావేశంలోనూ చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు చంద్ర‌శేఖ‌ర్ వెల్ల‌డించారు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌, టెక్ మ‌హీంద్రా, మైండ్‌ట్రీలాంటి దిగ్గ‌జ కంపెనీల సీఈవోలంతా ఈ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: