ఒకప్పుడు తమిళనాడులోని మైలాపూర్లో సాధారణ వీడియో షాపుకు ఓనర్ ఆమె...కానీ నేడు తమిళ రాజకీయాలను శాసిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించనున్న ధీశాలి. ఆమె మరెవరో కాదు శశికళ నటరాజన్. ఈ రోజు ఆమె ఈ స్థాయికి చేరిందంటే ఆనాడు శశికళను అప్పటి ఏఐఏడీఎంకే ప్రచారకర్తగా ఉన్న జయలలితకు పరిచయం చేసిన కలెక్టర్ చంద్రలేఖ పుణ్యమే అని చెప్పక తప్పదు.
తిరుత్తాయ్ పూండీలో ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వివేకానందమ్,కృష్ణవేణి దంపతులకు జనవరి 29,1956లో శశికళ జన్మించారు. ఆమెకు నలుగురు సోదరులు, ఒక సోదరి. పాఠశాల విద్య కూడా పూర్తి చేయని శశికళను అప్పుడు డీఎంకేలో చురుగ్గా పనిచేస్తున్న నటరాజన్ ప్రేమించారు. వారి ప్రేమ సంగతి తెలుసుకున్న కరుణానిధి స్వయంగా ఆయనే వారి వివాహం జరిపించారు. ఆ తర్వాత పీఆర్వోగా ప్రభుత్వ ఉద్యోగం కూడా నటరాజన్కు ఇప్పించారు. వాస్తవంగా చెప్పాలంటే శశికళ మూలాలు డీఎంకేకు చెందినవే. అప్పట్లో నటరాజన్ కడలూరు జిల్లా కలెక్టర్ చంద్రలేఖకు పీఆర్వోగా పనిచేశారు. ఈ చనువుతోనే జయలలితకు తన భార్య శశికళను పరిచయం చేయాల్సిందిగా కోరారు. ఇందుకు ఓకే చెప్పిన కలెక్టర్ చంద్రలేఖ, ఓ శుభ ముహూర్తానా శశికళను జయలలితకు పరిచయం చేశారు.
అప్పట్లో అన్నాడీఎంకే ప్రచారకర్తగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన ప్రచార కవరేజ్ను శశికళకు అప్పగించారు. అప్పడు ప్రారంభమైన వీరి స్నేహం నిదానంగా దృఢపడింది. శశికళ తన భర్తతో సహా జయలలిత నివాసమైన వేదనిలయానికి చేరుకున్నారు.వీరి స్నేహం ఎంతలా ఎదిగిందంటే అమ్మ ఆత్మ శశికళే అన్నట్లుగా తయారైంది. ఇందుకు నిదర్శనం శశికళ మేనల్లుడు సుధాకర్ను దత్తత తీసుకుని అతని వివాహం ఘనంగా జరిపించారు. అప్పట్లో ఈ వివాహం టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యిందని చెబుతారు పొలటికల్ అనలిస్టులు.జయలలిత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కావడం, ముఖ్యమంత్రి కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. జయలలిత సీఎం పదవిని అడ్డుపెట్టుకుని శశికళ సమాంతర ప్రభుత్వాన్ని నడిపినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి.
ప్రభుత్వం కార్యకలాపాల్లో శశికళ భర్త తలదూర్చుతున్నారన్న ఆరోపణలు రావడంతో 1990లో నటరాజన్ను పోయెస్ గార్డెన్ నుంచి బయటకు వెళ్లగొట్టారు జయలలిత. అయితే శశికళ మాత్రం అక్కడే పోయెస్ గార్డెన్స్లోనే ఉన్నారు. 2011లో శశికళపై అనేక ఆరోపణలు రావడంతో ఆమెను కూడా పోయెస్ గార్డెన్స్నుంచి తప్పించారు జయలలిత. ప్రభుత్వ పాలనలోగానీ, పార్టీ వ్యవహారంలోగానీ కలగజేసుకోబోనని పశ్చాత్తాపంతో ఓ లేఖ రాయడంతో శశికళను క్షమించి మళ్లీ అక్కున చేర్చుకున్నారు జయలలిత.
శశికళ తనకు అమ్మలేని లోటును తీర్చారని జయలలిత పలు ఇంటర్వ్యూల్లో బాహాటంగానే చెప్పుకొచ్చారు. దీంతో శశికళ స్థానమేమిటో పార్టీ కార్యకర్తలకు, అన్నాడీఎంకే నేతలకు తెలిసొచ్చింది. ఇక అప్పటి నుంచి శశికళను చిన్నమ్మగా పిలవడం మొదలు పెట్టారు. అంతేకాదు జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి మూడునెలల వరకు అంటే తన తుదిశ్వాస వరకు అంతాతానై వ్యవహరించారు శశికళ. అమ్మ మేనకోడలు దీపాను కూడా జయలలితను చూసే అవకాశం కల్పించలేదనే ఆరోపణలు ఉన్నాయి.
అమ్మ మరణం తర్వాత ఆమె అంత్యక్రియలను శశికళ నిర్వహించడంతో పార్టీ పగ్గాలు, ప్రభుత్వ బాధ్యతలు రెండూ శశికళే చేపడతారనే సంకేతాలు చాలా బలంగానే ప్రజల్లోకి వెళ్లాయి. అయితే కొంత సమయం తీసుకుని ముందుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. మరికొన్ని రోజులు తర్వాత ప్రభుత్వ పగ్గాలపై కన్నేసిన శశికళ ఆ దిశగా పావులు కదిపి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. అన్నాడీఎంకే నేతల మనసును గెలవగలిగిన చిన్నమ్మ కార్యకర్తల మనసును తమిళ ప్రజల హృదయాలను గెలుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే చిన్నమ్మ ముఖ్యమంత్రి అవుతారన్న విషయాన్ని సామాన్య ప్రజానీకం వ్యతిరేకిస్తోంది. 6 నెలల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. ఇప్పటికే అమ్మ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. అయితే అక్కడి స్థానికులు శశికళను గెలిపించమని తెగేసి చెబుతున్న నేపథ్యంలో చిన్నమ్మ మరో స్థానం కోసం వెతుకుతున్నట్లు సమాచారం.