మూడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఫలితాలు రాబోతున్నాయి. ప్రత్యేకించి కడప జిల్లా ఫలితాలపైనే అందరి కళ్లూ ఉన్నాయి. ఇక్కడ ఏపీ ప్రతిపక్షనేత జగన్ బాబాయి వివేకానందరెడ్డి పోటీలో ఉంటే.. టీడీపీ తరపున బీటెక్ రవి బరిలో ఉన్నారు. ఇది జగన్ కంచుకోట..దశాబ్దాలుగా ఇక్కడ వైఎస్ కుటుంబానిదే పై చేయి. అలాంటి చోట టీడీపీ గెలవబోతోందా.. చరిత్ర తిరగరాయబోతోందా..!?
ఇప్పుడు ఇవే సందేహాలు.. అందుకే ఈ ఫలితంపై కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయట. ఇక్కడ జగన్ బాబాయి గెలిస్తే.. అదో వార్త కానేకాదు.. టీడీపీ గెలిస్తే మాత్రం సంచలనమే కాదు.. జగన్ కు రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ అవుతుంది కూడా. ఇప్పటికే జిల్లాలోని ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సీటు కూడా గెలిస్తే జగన్ ప్రభ తగ్గడం ఖాయం.
వైసీపీ అభ్యర్థి వివేకాకు ఘన చరిత్రే ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడు. మాజీ మంత్రి కూడా. మాజీ సీఎం వైఎస్ఆర్కు సోదరుడు. 1981లో రాజకీయ ప్రవేశం చేసిన వివేకానందరెడ్డి పులివెందుల సమితీ అధ్యక్షునిగా గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2010లో మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు.
టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి.. 20 ఏళ్ల నుంచి టీడీపీలో ఉన్నారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందులు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా, బీటెక్ రవి హోరాహోరిగా తలపడ్డారు. ఇప్పుడు ఫలితం కోసం వైసీపీ, టీడీపీలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. టీడీపీ వర్గాల అంచనా ప్రకారం 40 ఓట్ల తేడాతో గెలుస్తామని ధీమాగా అంటున్నారు. ఫలితం ఏమవుతుందో చూడాలి.