కేసీఆర్, చంద్రబాబు.. ఈ ఇద్దరు సీఎంలో 2014 ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన వారే. విచ్చలవిడిగా హామీలు గుప్పించారు. వాటిలో ప్రధానంగా రైతుల రుణమాఫీ ఒకటి. ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చారు కానీ దాన్ని సంపూర్ణంగా అమలు చేయాలంటే.. వేల కోట్లు కావాలి. అన్ని నిధులు ఎక్కడివీ.. అందుకే అది సంపూర్ణంగా అమలుకావడంలేదు.
దీనికితోడు కరవు పరిస్థితులు నెలకొనడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వీటిపై కడుపు మండిన ఓ రైతు హైకోర్టులో పిటీషన్ వేశాడు. రైతులు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని పరిష్కరించి ఆత్మహత్యలను నివారించడంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం శాఖమూరుకు చెందిన రైతు కొల్లి శివరామిరెడ్డి ఈ పిటీషన్ వేశారు.
ఈ పిటీషన్ పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యాజ్యం దాఖలు చేసిన కొల్లి శివరామిరెడ్డి స్వయంగా ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని ఆయన వాదించారు.
బడా వ్యాపారులు రుణం ఎగవేస్తే స్పందించని బ్యాంకులు.. చిన్న చిన్న రుణాల చెల్లింపుల కోసం రైతులను వేధిస్తున్నారని శివరామిరెడ్డి తెలిపారు. ఆయన వాదనలు విన్న న్యాయమూర్తి ఆత్మహత్యలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపారు. పనిలో పనిగా రిజర్వ్ బ్యాంకుకు, నాబార్డులకూ హైకోర్టు నోటీసులిచ్చింది.