డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అన్న అహంభావంతో కొంత మంది చేయకూడని తప్పులు చేస్తుంటారు. అయితే కొంత మంది డబ్బుకి లొంగిపోయేవారు కూడా ఉంటారు..కానీ కొంత మంది లంచం అంటే తాట తీస్తామనే నిజాయితీ పరులు కూడా ఉన్నారు. తాజాగా తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం ఆర్.కె.నగర్ లో ఉప ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. అయితే గెలుపు కోసం శశికళ వర్గం..పన్నీర్ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జయలలిత మేనకోడలు దీపా కూడా తన వంతు కృషి చేస్తుంది.
తాజాగా శశికళ వర్గానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ గుర్తు కోసం ఏకంగా ఎన్నికల కమిషన్కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ బుక్కయ్యారు. ఏఐఏడీఎంకే పార్టీ సింబల్ అయిన 2 ఆకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారులకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరణ్ని నిందితుడిగా చేర్చుతూ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో ఢిల్లీలోని ఓ హోటల్లో సోమవారం ఉదయం సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతడి నుంచి రూ. 1.5 కోట్ల నగదుని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఓ బీఎండబ్లూ, మెర్సిడెస్ బెంజ్ కార్లని సీజ్ చేశారు. రెండు ఆకులు అన్నాడీఎంకే పార్టీ గుర్తు అనే విషయం తెలిసిందే. దీనికోసం పన్నీర్ వర్గం, శశికళ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఏఐఏడీఎంకే పార్టీ సింబల్ అయిన రెండు ఆకుల గుర్తు కోసం వేర్వేరు అభ్యర్థులు పోటీపడటంతో ఎన్నికల సంఘం ఆ గుర్తుని తాత్కాలికంగా ఎవరికీ కేటాయించకుండా పక్కనపెట్టేసింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తనకు రెండాకులు గుర్తు వచ్చేలా ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారిని ఆశ్రయించారు దినకరన్. ఆయన ద్వారా ఈసీకి లంచం ఇవ్వాలనుకున్నారని వెలుగు చూసింది. మొత్తానికి అసలే కష్టాల్లో ఉన్న శశికళకు మరో తలనొప్పి వ్యవహారంగా మారింది.