తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో విజయం సాధించిన 48మంది పార్టీ కౌన్సిలర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ గట్టి హితబోధ చేశారు. పార్టీ నుంచి జంప్ కాబోనని ప్రమాణం చేయాలని ఆయన కోరారు. అలాగే కౌన్సిలర్లంతా నిజాయతీగా నడుచుకోవాలని అన్నారు.ఒకవేళ ఇతర సభ్యులెవరైనా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైనా ఇవ్వజూపుతూ ఫోన్ చేస్తే అలాంటి కాల్స్ను రికార్డు చేయాలని ఆయన చెప్పారు. ఇతర పార్టీల వారు ఒక్కోసారి రూ.10 కోట్లకు పైగా ఇస్తానని ప్రలోభపెట్టవచ్చని, దాన్ని తిరస్కరించాలని ఆయన అన్నారు.
తన హితబోధ ముగిసిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోమని కొత్త కౌన్సిలర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో గెలిచిన పార్టీ కౌన్సిలర్లను పార్టీ మారకుండా కాపాడుకునే రీతిలో ఆయన ప్రసంగం సాగింది. ఈ మేరకు పదినిమిషాల వీడియోను ఆయన యూట్యూబ్లో పోస్టు చేశారు. అంతకుముందు భారీ మొత్తంలో విజయం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్కు ఇలాంటి తీర్పునివ్వడం పార్టీ మనుగడకే దాదాపు ప్రశ్నార్థక పరిస్ధితి.
ఆప్ నీటిమీద గాలిబుడగేనా అంటూ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోపక్క, ఆప్లో రాజీనామాల పరంపర మొదలైంది. ఇటీవలె దిలీప్ పాండే ఢిల్లీ ఇంచార్జీ బాధ్యతల నుంచి తప్పుకోవడం, పంజాబ్లో పార్టీ బాధ్యతల నుంచి సంజయ్ సింగ్ ఇంకొంతమంది తప్పుకోవడం వంటి పరిణామాలు పార్టీలో భిన్నస్వరాలు వినిపించడంతోపాటు ధిక్కారాలు కూడా బహిరంగం అవుతుండటంతో మరోసారి కేజ్రీవాల్ పెద్ద మొత్తంలో పార్టీ నేతలను కలిసి ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు