చంద్రబాబును ఓ తెలుగు దేశం ఎంపీ రాజీనామా పేరుతో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమని ప్రకటిస్తున్నారు. అయితే ఆ రాజీనామా బెదిరింపు కోసం కాదు... రెండు పదవులు ఉంటే.. ఆ పదవి ఇవ్వడం కుదరదని చెబితే... ఎంపీ పదవైనా సరే వదులుకుంటా కానీ ఆ పదవి మాత్రం ఈసారి ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు..
ఇంతకీ ఎవరా ఎంపీ.. ఏంటా పదవి అంటారా.. ఆయన రాయపాటి సాంబశివరావు.. ఆ పదవి టీటీడీ ఛైర్మన్ పదవి.. ఈ పదవి త్వరలో ఖాళీ కాబోతోంది. ఏపీలో మంత్రిపదవుల తరవాత అత్యంత గిరాకీ ఉండే పదవి ఇదే అంటే అతిశయోక్తి కాదు.. ఒక్కమాటలో చెప్పాలంటే మంత్రిపదవి కంటే దీనికే ఎక్కువ పోటీ ఉంటుంది. ఔను మరి తిరుపతి శ్రీనివాసుని సన్నిధిలో అత్యున్నత పదవి అంటే మాటలా.
రాయపాటి సాంబశివరావుకు టీటీడీ ఛైర్మన్ కావాలని ఎప్పటి నుంచో కోరిక. పలుసార్లు చివరి నిమిషం వరకూ ఆ పోస్టు వచ్చినట్టే వచ్చిజారిపోయింది. అందుకే ఈసారి ఆ పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. అవసరమైతే ఎంపీ పదవికైనా రాజీనామా చేస్తానని చంద్రబాబుకు చెప్పుకుంటున్నారు. ఐతే... చంద్రబాబు ఈ పదవిపై ఇప్పటికే గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
చంద్రబాబు సన్నిహితుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ కు ఈ పదవి ఖాయమైనట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మరి చంద్రబాబు ఈ సారైనా రాయపాటి సాంబశివరావును కరుణిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. రాయపాటి మాత్రం ఈ పదవిపై ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు.