భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమైంది. ఉపగ్రహ ప్రయోగాలు ఇస్రోకు కొత్త కాకపోయినా.. ఈ ప్రయోగం మాత్రం చాలా కీలకమైంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రయోగిస్తున్న జీఎస్ఎల్వీ-ఎఫ్ 09 బరువు 2230 కిలోలు. ఇస్రో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే కావటం విశేషం.
సాధారణంగా ఇంత బరువున్న ఉపగ్రహాల ప్రయోగం కోసం మనం ఇప్పటివరకూ విదేశాలపై ఆధారపడుతూ వస్తున్నాం. పీఎస్ఎల్పీ మనకు అత్యంత విశ్వసనీయమైన రాకెట్ అయినా దాని ద్వారా ఇంత బరువైన ఉపగ్రహాలు ప్రయోగించలేం. అందులోనూ.. ఈ ఉపగ్రహంలో మొట్ట మొదటి సారిగా ఎలక్ట్రికల్ ప్రొపల్షెన్ విదానాన్ని పొందుపరిచారు. దీని ద్వారా శాటిలైట్ బరువు తగ్గుతుంది.
ఇప్పటి వరకు ఉపగ్రహాల్లో రసాయనిక ఇంధనాలు ఉపయోగించేవారు. ఇందుకోసం విదేశాలపై కొంత ఆదారపడాల్సి ఉండేంది. ప్రస్తుతం ప్రయోగించబోయే జీశాట్-9లో ఎలక్ట్రికల్ ప్రొపల్షెన్ సిస్టమ్ ను తొలిసారిగా వినియోగిస్తున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో బరువైన ఉపగ్రహాలను కూడా తేలికగా పంపే వీలుకలుగుతుంది. ఈ జీశాట్ 9 సమాచార వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది.
ఈ ఉపగ్రహా ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ గురువారం మద్యాహ్నం 12.57 గంటల నుంచి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 4.57 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 09 వాహాన నౌక జీశాట్-9 ఉపగ్రహాన్ని నిప్పులు కక్కుకుంటూ మోసుకుపోతుంది. ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ గురువారం షార్ కు చేరుకున్నారు. ఈ ప్రయోగం వీక్షించేందుకు పార్లమెంటరీ కమిటీ బృందం నేడు షార్కు రానుంది.