భారత దేశం గర్వించదగ్గ సమయం రానే వచ్చింది.. నేడు ఇస్రో కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ప్రపంచ దేశాలు మనవైపే చూసే తొలి ప్రయోగం ఇవాళ జరిగింది. అత్యంత భారీ రాకెట్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(జీఎస్ఎల్వీ) మార్క్-3 డీ1 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి నిప్పులు చిమ్ముతూ జీఎస్ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ నింగికి దూసుకెళుతోంది. ఈ ప్రయోగం ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం కోసం నిన్న సాయంత్రం 3.58 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూశారు. నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ ... జీశాట్-19 ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో ఘన విజయం నమోదైన సందర్భంగా ఆ సంస్థ ఛైర్మన్ కిరణ్కుమార్ మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో డైరెక్టర్ కున్హి కృష్ణన్ మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. క్లిష్టతరమైన రాకెట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం భారత్కి అలవాటైపోయిందని వ్యాఖ్యానించారు. ఇది దేశానికే గర్వకారణమని అన్నారు.