రాహుల్ గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గా ఉన్నారు. ఆయనకి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తోంది. గడిచిన మూడు సంవత్సరాల కాలం లో అది మరీ ఎక్కువగా మారింది. కాంగ్రెస్ సొంత గూటి జనాలు ఈ చర్య ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అంటూ మ్యడం సోనియా గారికి సలహాలు ఇస్తూనే ఉన్నార. అయితే రాబోయే ఎన్నికలకి సరిగ్గా రెండు సంవత్సరాల ముందరే సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ కి ఇదే మంచి టైం అని సలహా ఇస్తున్నారు.
త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలౌతుందని, అక్టోబర్ లో రాహుల్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమౌతోంది పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఉన్నట్టుండి ఇప్పుడే రాహుల్ కి పగ్గాలు ఎందుకు ఇవ్వబోతున్నట్టు అంటే… ఇది కాంగ్రెస్ మెగా వ్యూహంలో భాగం అని చెప్పాలి! 2019 ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని భాజపాను ఎదుర్కోవాలంటే ఇప్పట్నుంచే సన్నాహాలు చేసుకోవాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
దాన్లో భాగంగా దేశంలోని భాజపా వ్యతిరేక పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి, ఒక మహా కూటమి తయారు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోందని సమాచారం. ఈ మహా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తే బాగుంటుందనేది వారి ఉద్దేశం. ఆలోచన అయితే బాగానే ఉందిగానీ, ఈ కూటమిలోకి వచ్చేవారు ఎంతమంది..? రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించేవారు ఎంతమంది అనేది వేచి చూడాలి.
పైగా, రాహుల్ గాంధీ ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటోందనే సెంటిమెంట్ కూడా ఉంది. రాహుల్ నాయకత్వంపై కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వర్గం కూడా ఉంది! ఏదేమైనా రాహుల్ పార్టీ అధ్యక్షుడు కావడం అనేది ఎప్పటికైనా జరిగేదే. కానీ, పార్టీ బాధ్యతతోపాటు కొన్ని సవాళ్లను కూడా ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది వాస్తవం.