మనం సాధారణంగా ఓ సామెత వింటుంటాం..ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు..అని. ఈ కాలంలో ఇల్లు కట్టాలన్నా..పెళ్లి చేయాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే వాటి కోసం ఎంతో ప్లాన్ చేసుకుంటే కానీ కుదిరే పనులు కావని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు 2 వేల మంది యువతుల పెళ్లి చేసి భారత దేశంలోనే ఆదర్శప్రాయుడు అయ్యారు. ఆ యువతులకు తానే తండ్రి స్థానంలో ఉంటూ..251 సామూహిక వివాహాలు జరిపించారు. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరా అనుకుంటున్నారా..గుజరాత్లో వజ్రాల వ్యాపారం చేసే మహేష్.
అయితే ఈయన అలా తండ్రి లేని ఆడపిల్లకు ఎందుకు వివాహం జరిపిస్తున్నారో తెలియాలంటే దాని వెనుక మరో విషాద సంఘటన ఉంది. 2008లో మహేష్ ఎంతగానో ప్రేమించే తన సోదరుడిని కోల్పోయాడు. ఆయన సోదరుడు ఈశ్వర్ సవానీ..తన కూతుళ్లు అయిన మితుల, అమ్రుతల వివాహం చేయించేందుకు నగల కోసం ఓ దుకాణం వెళ్లారు. ఆ నగల వ్యాపారి నగలకు గానూ బిల్లుని ఒకేసారి చెల్లించాలని, లేకుంటే వాటిని ఇవ్వమని దుకాణదారుడు చెప్పాడు. దీంతో ఒక్కసారి అంత డబ్బు కట్టడం ఎలా అని టెన్షన్ పడ్డ ఈశ్వర్ కి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఆ బాధ్యత మహేష్ తీసుకొని సోదరుడి కూతుళ్ల వివాహాలను జరిపించారు.
అప్పటి నుంచి తండ్రి లేని ఎంతగా ఉంటుందో..వివాహం వయసు వచ్చిన అమ్మాయిలు ఎంత ఆవేదన చెందుతారో ఆయనకు అర్ధం అయ్యింది. అంతే అలాంటి ఆవేదన ఏ అమ్మాయి పడకూడదని తన వంతుగా ఒక్కో యువతి పెళ్లికి దాదాపు రూ.4 లక్షలు చొప్పున ఖర్చుచేస్తున్నారు. అంతేకాదు తండ్రి కోల్పోయిన బాలికల కోసం ఓ స్కూలు నెలకొల్పి, ఉచితంగా విద్య అందిస్తున్నారు. మరోవైపు సూరత్లో 238 పాఠశాలలు, 19 కాలేజీల్లోని విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో ఆయన పేరు మరోసారి దేశ వ్యాప్తంగా నిలిచింది.