ఫ్రెండ్లీ పోలిసింగ్. ఇప్పుడు పోలీస్ శాఖలో ప్రధానంగా వినిపిస్తున్న పదం ఇది. ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే.. ప్రజలకు చేదోడువాదోడు గా ఉండడం, ప్రజల పట్ల ప్రేమ పూరితమైన వైఖరితో మెలగడం. అయితే ఈ విధానాన్ని పతి ఒక్కరూ అవలంభిస్తున్నారా..? అంటే లేదనే సమాధానమే విస్పష్టం. కారణం కొందరు పోలీసుల మొండి వైఖరి. కానీ పేదరికాన్ని జయించి బాగా కష్టపడి చదువుకొని పోలీస్ ఉద్యోగాలను సంపాదించిన యువ పోలీసులు మాత్రం ఫ్రెండ్లీ పోలిసింగ్ సిస్టం కి చాలా దగ్గరగా ఉన్నరానే చెప్పవచ్చు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ పోలీస్. ఆయనే.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగమల్లు.
నాగమల్లు బుధవారం రాత్రి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద నైటీడ్యూటీలో ఉండగా.. ఓ బాలుడు రోడ్డుపై ఏడుస్తూ దీనంగా కన్పించాడు. దీంతో వెంటనే అతడిని దగ్గరకు తీసుకుని ఏమైందని అడిగారు. అప్పుడు ఆ బాలుడు.. తన అమ్మమ్మ వాళ్లు నగరంలో పూల మొక్కలు అమ్ముకుంటూ ఉంటారని వాళ్లని చూసేందుకు వచ్చానని చెప్పాడు. హైదరాబాద్ కు వచ్చి చూసేసరికి వాళ్లు వేరే ఊరికి వెళ్లినట్లు తెలిసిందని ఆ బాలుడు తనతో చెప్పాడని తెలిపారు.
ఆ బాలుడి అమ్మమ్మ కుటుంబ సభ్యుల వద్ద ఫోన్ కూడా లేదని తనతో చెప్పాడని ఆ పోలీస్ తెలిపారు. ఆ బాలుడి పేరు పులి నాని అని, అతడికి తల్లిదండ్రులు లేరని చెప్పారు. తన వయసు 11ఏళ్లని, వినుకొండ అనాథాశ్రమంలో ఉంటూ ఆరో తరగతి చదువుతున్నట్లు చెప్పాడు. వూరికి వెళ్లేందుకు ఎక్కడ బస్సు ఎక్కాలో తెలియట్లేదని ఏడుస్తూ చెప్పాడు. దీంతో నాగమల్లు ఆ బాలుడికి డబ్బు ఇవ్వగా.. ఛార్జీకి తన వద్ద 320 రూపాయలు ఉన్నాయని, ఆ డబ్బులతో అన్నం తింటే ఇంటికి వెళ్లేందుకు డబ్బులు సరిపోవన్న కారణంతో ఏమీ తినలేదని చెప్పాడు. ఆ బాలుడు చెప్పిన కథకి చలించిపోయిన ఆ పోలీసు వెంటనే అతడికి అన్నం తినిపించారు. ఆ తర్వాత పుస్తకాలు కొనుక్కోమని రూ. 2వేలు ఇచ్చారు. ఆ బాలుడు ఎక్కడినుంచి వచ్చాడో కనుక్కొని తిరిగి బస్సు ఎక్కించి పంపించారు. ఆ బాలుడికి ఏదైనా అవసరముంటే ఫోన్ చేయమని తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు.