వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఆయన చెప్పినట్టే పార్టీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ లీడర్లంతా వినాల్సిందే. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ చేసే పని ఏంటంటే వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహాలు రచించి అమలు పరచడమే. 2019 ఎన్నికల కోసం భారీ ప్యాకేజీతో ప్రశాంత్కిషోర్ను వైసీపీ నియమించుకుంది. మరి ఆ పనిలో నిమగ్నమైన ప్రశాంత్ కిషోర్ సరిగ్గానే తన విధులు నిర్వర్తిస్తున్నాడా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
నిజానికి కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గెలుపునకు ఆయన వ్యూహాలు చాలా వరకు పనిచేశాయి. ముఖ్యంగా మోడీ సోషల్ మీడియాలో తిరుగులేని కింగ్గా అవతరించడంలోను, ఆయనకు సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు రావడంలోను ప్రశాంత్ వ్యూహాలు బాగా పనిచేసినట్టు టాక్. ఆ తర్వాత ప్రశాంత్ మోడీకి, బీజేపీకి యాంటీగా బిహార్ నితీష్కుమార్ – లాలూ ప్రసాద్ యాదవ్ కూటమి తరపున పని చేయడంతో ఆ కూటమి దెబ్బకు బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ప్రశాంత్కిషోర్ వ్యూహాలు మరోసారి సక్సెసయ్యి నితీష్ సీఎం అయ్యాడు. ఇలా మోడీకి, నితీష్కు తన వ్యూహాలు సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోయింది.
అయితే ఈ రెండు ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపునకు ప్రశాంత్ డైరెక్షన్, వ్యూహాలతో పాటు గెలిచిన పార్టీలకు కాస్త పాజిటివ్ వేవ్ ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ యూపీలో అఖిలేష్ యాదవ్ – రాహుల్ గాంధీల గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. ఇక్కడ వీరిద్దరు కలిసినా బీజేపీ చేతిలో ఘోరా ఓటమి చవిచూశారు. అంటే యూపీలో పీకే వ్యూహాలు వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ను తన గెలుపు కోసం ఏపీలో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ఏపీలో తన పని స్టార్ట్ చేసేశాడు.
ప్రశాంత్ కిషోర్ పలు సర్వేలు చేశాడని వినిపించింది. 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఇద్దరు ఎంపీలకు టిక్కెట్లు కూడా ఇవ్వవద్దని చెప్పాడని కూడా వార్తలు వస్తున్నాయి. పార్టీలో ఇప్పటి వరకు జగన్ సీనియర్లకు గౌరవం ఇచ్చాడన్న మాట మనం ఏనాడు వినలేదు. అలాంటిది ఇప్పుడు జగన్ సీనియర్లకు చాలా ప్రయారిటీ ఇస్తున్నాడని టాక్ వస్తోంది. ఇక ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన జగన్ ఆయన కాళ్లకు పాదాభివందనం చేసి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇక మోడీని సైతం కలిసి వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే జగన్లో ఈ మార్పునకు ప్రశాంత్ కిషోరే కారణమన్న టాక్ కూడా వినిపిస్తోంది.
మరోవైపు ప్రశాంత్ కిషోర్ కొంతమందికి సిట్టింగ్లకు టిక్కెట్లు ఇవ్వవద్దని చెప్పినా జగన్ మాత్రం ఆ మాటను పక్కన పెట్టేశాడని టాక్ వినిపిస్తోంది. ఇలా అప్పుడే జగన్.. ప్రశాంత్ కిషోర్ చెపుతోన్న అన్ని మాటలను పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది.
అయితే, ప్రశాంత్ చెప్పిన మాటలు విని జగన్ మారిపోయినంత మాత్రాన ఆయన ఎన్నికల్లో గెలిచి… సీఎం అయిపోతాడా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రశాంత్ వ్యూహాలు నార్త్లో పని చేసినట్టు సౌత్లో ఇంకా చెప్పాలంటే ఏపీ, తెలంగాణలో పని చేస్తాయా..? సామాజిక వర్గాల గుండె చప్పుడు, ఏపీ ప్రజలనాడి, వివిధ వర్గాల మనోభావాలు నార్త్కు చెందిన పీకేకు ఎంతవరకు అర్థం అవుతాయన్న ప్రశ్న ఉదయిస్తోంది. పీకే చెప్పేవి ఏం వినాలో ఏం వినకూడదో జగన్కు స్పష్టత ఉందా? ఫైనల్గా ప్రశాంత్ కిషోర్.. వైసీపీని బలోపేతం చేస్తారా? కొత్తకొత్త లెక్కలతో బలహీన పరుస్తున్నారా? అనే ప్రశ్న తెలుగు రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుచిక్కడం లేదు.