తెలంగాణలో టీఆర్ఎస్ దూకుడు ముందు విపక్షాలు సైతం ఆగని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కేసీఆర్ దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో సైతం ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికలకు మరో 20 నెలల టైం ఉన్న నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు అప్పుడే వచ్చే ఎన్నికల్లో గెలుపుపై వ్యూహాలు రచించుకుంటున్నారు.
ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారికి అనుకూలమైన నియోజకవర్గాల వేటలో వారు ఉన్నారు. ఇక ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి మంత్రి పదవి చేపట్టాలన్న ఆతృతతో ఉన్నారు. అక్కడి వరకు ఓకే. కేసీఆర్ కేబినెట్లో ముగ్గురు మంత్రులు మాత్రం వచ్చే ఎన్నికల్లో తమ నియోజకవర్గాలు మారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు మంత్రులు తమ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటుంటే మరో మంత్రి మాత్రం తన ప్రయోజనం కోసం నియోజకవర్గం మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
మంత్రులు మహేందర్రెడ్డి, కేటీఆర్, జగదీశ్రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. మహేందర్రెడ్డి ప్రస్తుతం ప్రాథినిత్యం వహిస్తోన్న తాండూరులో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇటీవల తాండూరు మునిసిపాలిటీ సైతం కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఈ క్రమంలోనే ఆయన గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లిపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఆయన ఇటీవల తరచూ శేరిలింగంపల్లిలో పర్యటిస్తూ అక్కడ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
ఇక సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచిన జగదీశ్రెడ్డి నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంటోందని కేసీఆర్ చేసిన సర్వేలో కూడా వెల్లడైందట. దీంతో జగదీశ్రెడ్డి వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో నల్గొండ జిల్లా సెటిలర్లు ఎక్కువుగా ఉన్న ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
ఇక సిరిసిల్ల నుంచి మంత్రిగా ఉన్న కేటీఆర్కు నియోజకవర్గం దూరమవ్వడంతో ఆయన తరచూ అక్కడకు వెళ్లి రావడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. కేటీఆర్ ప్రభుత్వంలోను, పార్టీలోను నెంబర్ 2గా ఉన్నారు. ఐటీ మంత్రిగా తరచూ విదేశీ పర్యటనలు, సమీక్షలతో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గ్రేటర్ పరిధిలో కూకట్పల్లి నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన కన్ను ఉప్పల్ మీద పడిందని తెలుస్తోంది.
తాను నియోజకవర్గం మారనని కేటీఆర్ చెపుతున్నా వచ్చే ఎన్నికల్లో ఆయన గ్రేటర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో ఇంటర్నల్గా చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా ముగ్గురు మంత్రులు నియోజకవర్గాలు మారడం..అదీ గ్రేటర్ నుంచే ఈ ముగ్గురు పోటీ చేస్తే అప్పుడు టీఆర్ఎస్ మంత్రుల్లో మెజార్టీ గ్రేటర్ నుంచే ఉంటారు. ఇప్పటికే గ్రేటర్ నుంచి తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావు, మహ్మద్ ఆలీ, నాయిని నర్సింహారెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.