నిజంగా ఈ విషయంలో తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ఒక క్రిమినల్స్లను సమాజంలో ఎంత భయంగా చూస్తామో, కనీసం వారివైపు కూడా చూడలేం. ఒక వేళ చూసినా వారికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది అనుకునే వారే ఎక్కువ. కానీ మన దేశంలోని ఓటర్లు ఏకంగా 33 శాతం మంది క్రిమినల్స్ లను ఎంపీలు, ఎమ్మెల్యే లు గా ఎన్నుకున్నామట. తాజాగా ప్రజా స్వామ్య సంస్కరణల సంఘం దిమ్మతిరిగే నివేదిక ఇచ్చింది.
భారత రాష్ట్రపతిని మరో రెండురోజుల్లో దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోబో తున్నది. ఈ కాలేజీలో 33శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. సోమవారంనాడు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొననున్న 776ఎంపీలకు గాను 774 మంది, 4120 మంది ఎమ్మెల్యేలకుగాను 4078 మంది ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తనిఖీ చేసి ఓ నివేదికను రూపొందించింది.
మొత్తం 4896మంది ఓటర్లకుగాను సుమారు 1600మందిపై క్రిమినల్ కేసులున్నాయని నివేదిక సారాంశం. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో 451మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే, మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో మహిళల సంఖ్య తొమ్మిదిశాతం మాత్రమే. మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో 71శాతం కోటీశ్వరులున్నారని ఈ నివేదిక వెల్లడించింది.