2019లో ఎలాగైనా సీఎం కావాలని ఆశపడుతున్న వైసీపీ అధినేత జగన్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సెమీఫైనల్స్గా భావించిన నంద్యాల ఉప ఎన్నికలతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజ యం.. నైతికంగా పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఈ సమయంలో సీనియర్ల అండ ఉంటే మంచిదనే అభిప్రాయా నికి జగన్ వచ్చారు. అందుకే తన తండ్రికి ఆప్తులైన వారిని అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన తండ్రికి అత్యంత సన్నిహితుడు, వైఎస్ ఆత్మగా భావించిన కేవీపీని దగ్గర చేసుకునే పనిలో పడ్డారు జగన్. ఇందు కు సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని.. ఇద్దరి మధ్య డీల్ ఫిక్స్ అయిందనే చర్చ మొదలైంది.
దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. అయితే వైఎస్ మరణం తర్వాత.. కేవీపీ రాజకీయాలకు దూరమైపోయారు. వైఎస్ తనయుడు జగన్ సొంత పార్టీ పెట్టుకున్నా.. అందులోకి వెళ్లకుండా కాంగ్రెస్లోనే ఉంటున్నారు. అయితే నంద్యాల, కాకినాడ ఫలితాలు చూశాక రాజకీయంగా పెద్ద దిక్కు లేకుండా ముందుకు వెళ్లడం సరికాదని జగన్ భావిస్తున్నారు. ఆ స్థానాన్ని అరువు తెచ్చుకున్న వ్యక్తికి కాకుండా తన అనుకునే వాళ్లు అయితే బాగుంటుందని జగన్ కి భార్య, కుటుంబ సభ్యులు సలహా ఇచ్చారట. ఎప్పుడూ ఇంకోరి మాట వినని జగన్ ఈసారి సరే అనడంతో పాటు వెంటనే రంగంలోకి దిగారట.
ఆ పెద్ద దిక్కు ఒకప్పుడు తన తండ్రికి ఆత్మ అయిన కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్లు తనకు, పార్టీకి మంచిదని జగన్ భావించారు. అనుకున్నదే తడవుగా వై.ఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కేవీపీ కి పిలుపు వెళ్లింది. ఆయన కూడా అక్కడికి వెళ్లారట. ఇడుపులపాయ వేదికగా గురించి జగన్, కేవీపీ సుదీర్ఘంగా చర్చించుకుని అభిప్రాయ బేధాలు తొలిగించుకున్నారట. `నిన్ను సీఎం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాన`ని కేవీపీ చెప్పడంతో జగన్ కు కొండంత అండ దొరికనట్టు అయిందట. చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న స్థాయి సన్నద్ధత సరిపోదని కూడా కేవీపీ స్పష్టంచేశారట.
ఇదే అదనుగా కేవీపీ ముందు జగన్ మామ.. ఓ ప్రతిపాదన పెట్టారట. పార్టీ లో చేరితే బాగుంటుందని కేవీపీ ని జగన్ అడిగారట. చేరితే రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేశారట. అంతేగాక పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీలో కీలక బాధ్యత లు ఇస్తామని కూడా వివరించారట. దానిపై నిర్దిష్ట అభిప్రాయం చెప్పకుండానే కేవీపీ మాట దాటవేశారట. జగన్ ప్రయత్నాలు ఫలించి కేవీపీ వైసీపీ లోకి వెళితే ఆంధ్ర రాజకీయాలతో పాటు వైసీపీకి మళ్లీ కొంత బలం వచ్చినట్టే! మరి కేవీపీ నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!