ఏపీలో అధికార టీడీపీలోకి భారీగా వలసలను ప్రోత్సహించే విషయంలో టీడీపీ సంగతేమో గాని కొన్ని మీడియా పక్షాలు బాగా ఉత్సాహంగా ఉన్నట్టు వాతావరణం కనిపిస్తోంది. టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న ఓ ప్రముఖ మీడియా సంస్థకు చెందిన పేపర్, ఛానెల్లో అయితే వైసీపీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతున్నారని ఓ విడత వార్తలు, స్క్రోలింగ్లు వచ్చేశాయి. ఒక్క వైసీపీ అధినేత జగన్ పేరు తప్పా ఆయనకు రైట్ హ్యాండ్గా ఉన్న శ్రీకాంత్రెడ్డి లాంటి వాళ్లు కూడా పార్టీ మారుతున్నారంటూ సదరు మీడియా సంస్థలో వార్తలు వచ్చేశాయి.
వైసీపీ ఎమ్మెల్యేపై మైండ్గేమ్ ఆడుతోన్న సదరు మీడియా సంస్థలో రెండు రోజులుగా సీమలో వైసీపీకి చెందిన ఐదుగురు టాప్ లీడర్లు పార్టీ మారుతున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో ఆ వార్తనే బేస్ చేసుకుని మిగిలిన మీడియా సంస్థలు, ఛానెళ్లలోను ఇష్టరాజ్యంగా ఎవరికి వాళ్లు వార్తలు రాసేశారు. వైసీపీకి చెందిన ఐదుగురు పెద్ద తలకాయలు టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైందని కథనాలు వచ్చాయి.
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ వార్తలు మీడియా సంస్థల ఉత్సాహమేనని సదరు నాయకులంతా కొట్టిపడేశారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకతో పాటు బాల నాగిరెడ్డి, జయరాం ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. తాము వైసీపీని వీడు ప్రశక్తే లేదని కుండ బద్దలు కొట్టేశారు.
టీడీపీ నాయకులు తమ తోక పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా అసత్య ప్రచారాలు మానుకోవాలని ఇద్దరు ఎమ్మెల్యేలు సూచించారు. ఆలూరు ఎమ్మెల్యే జయరాం కూడా తన రాజకీయ ఎదుగుదలకు బీజం వేసిన వైసీపీని వీడనని చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో తమ అనుకూల మీడియా ద్వారా ఈ ఇద్దరు ఎమ్మెల్యేపై టీడీపీ ఆడిన మైండ్గేమ్కు వీరు సూపర్ షాక్ ఇచ్చినట్టే కనపడుతోంది. వీళ్లపై టీడీపీతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా మైండ్ గేమ్ ప్లాప్ అయ్యింది. మరి ఇప్పుడు నెక్ట్స్ మైండ్ గేమ్లో ఏయే ఎమ్మెల్యేల పేర్లు తెరమీదకు తీసుకు వస్తారో ? చూడాలి.