తెలంగాణలో మరోసారి అధికారం కైవసం చేసుకోవాలన్ని పట్టుదల కేసీఆర్ లో బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యమున్న కాంగ్రెస్ .. అన్ని విపక్షాలనూ కలుపుకుని కేసీఆర్ పై కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సరికొత్త యాక్షన్ ప్లాన్ తో ముందుకొస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి దగ్గరయ్యేందుకు ప్లాన్ వేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కమ్మ, రెడ్డి సామాజికవర్గాలదే ఆధిపత్యం. తెలంగాణలో కమ్మ సామాజికవర్గానికి ఆధిపత్యం లేకపోయినా.. నిర్ణయాత్మక స్థాయిలో ఓటుబ్యాంకు కలిగి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలోని కమ్మలంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ .. లాంటి జిల్లాల్లో కమ్మ సామాజికవర్గానికి బలమైన ఓటు బ్యాంకు ఉంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మెజారిటీ కమ్మ నేతలు తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలు కేసీఆర్ తో అనుబంధం దృష్ట్యా టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పటికీ టీడీపీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని తనవైపు చేర్చుకోవడం ద్వారా తనకిక తిరుగుండదని కేసీఆర్ భావిస్తున్నారు. రెడ్డి వర్గం కాంగ్రెస్ వైపు నిలుస్తుంది. తాను వెలమ కాబట్టి వెలమలంతా తనతోనే ఉంటారు. టీడీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న కమ్మలను కాజేస్తే.. తనకు శాశ్వత అధికారం ఖాయమనేది కేసీఆర్ వ్యూహం.
ముఖ్యంగా నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా దాదాపు ఖాయమవుతోంది. నేడో రేపో ఆయన రాజీనామా చేయనున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యం. అక్కడ బంపర్ మెజారిటీ సాధించాలనుకుంటున్న కేసీఆర్.. అంతకుముందే కమ్మ సామాజికవర్గ నేతలతో భేటీ కానున్నారు. కమ్మల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
అంతేకాదు.. పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరవడం వెనుక కారణం కూడా ఇదేనంటున్నారు. పరిటాల కుటుంబానికి ఆంధ్రాలోనే కాక, తెలంగాణలోనూ పెద్దఎత్తున అభిమానులున్నారు. వారిని, ముఖ్యంగా కమ్మలను దగ్గర చేర్చుకోవడానికి శ్రీరామ్ పెళ్లికి అటెండ్ అవ్వడం మంచి సందర్భమని కేసీఆర్ భావించారు. అందుకే తుమ్మలను తీసుకుని పెళ్లికి వెళ్లొచ్చారు. చూద్దాం మరి.. కమ్మలు ఏమేరకు కేసీఆర్ కు కలిసొస్తారో..!