గత కొంత కాలంగా భారత దేశంలో ఓటర్ లిస్టు, ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ పై ఒకరి ముఖాలకు బదులు మరొకరి ముఖాలు రావడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు సామాన్యు ల ఫోటోల బదులు సెలబ్రెటీల ఫోటోలు రావడం ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఈసారి సెలబ్రెటీలకు బదులు భారతీయులు ఎంతో భక్తితో కొలిచే గణేషుడి ఫోటో వచ్చింది. ఏంటి..!! నమ్మటం లేదా...? నిజమండీ బాబూ..వినాయకుడికి ఈ సారి మనోళ్లు ఎగ్జామ్ కండెక్ట్ చేస్తున్నట్లు హాట్ టికెట్ ఇచ్చారు.
బీహార్ లోని లలిత్ నారాయణ్ మిథిల యూనివర్శిటీలో అధికారుల నిర్లక్ష్యం ఏకంగా గణేషుడికి హాల్ టికెట్ జారీ అయింది. అక్టోబర్ 9 నుంచి పరీక్షలు కావడంతో బీహార్లోని దర్భంగా వద్ద ఉన్న లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీలో బీకాం చదువుతున్న కృష్ణ కుమార్ రాయ్ హాల్ టికెట్ తీసుకోవడానికి కళాశాలకు వెళ్లాడు. ఆ హాల్ టికెట్ లో కృష్ణరాయ్ ఫోటోకి బదులు వినాయకుడి ఫోటో, కింద గణేషుడి సంతకం.. పైగా ఆ విద్యార్థి అడ్రస్ కూడా తప్పుగా రాసి ఉంది.
అయితే అతని గోడును అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో మీడియాను ఆశ్రయించాడు. `నేను దరఖాస్తు చేసుకునేటప్పుడు అన్నీ సరిగానే నింపాను. హాల్ టికెట్ ఇలా రావడంతో ఆశ్చర్యపోయాను. కొత్త హాల్టికెట్ కోసం వెళ్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నా పరీక్ష వినాయకుడు వచ్చి రాస్తాడా?` అని కృష్ణ ప్రశ్నించాడు.
దీనిపై అధికారులను ప్రశ్నించగా..హాల్ టికెట్లు ముంద్రించేందుకు బయట ప్రైవేట్ ప్రింటింగ్ మిషన్ల సాయం తీసుకుంటామని, బహుశా అక్కడ ఈ పొరపాటు జరిగి ఉండవచ్చునని.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని చెబుతున్నారు. ఇటీవల బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమిటి పరీక్ష సందర్బంగా ఓ అమ్మాయి హాల్ టికెట్పై భోజ్పురి హీరోయిన్ అంతరా బిశ్వాస్ (మోనాలిసా) టాప్ లెస్ ఫోటోను ముద్రించారు.