మాట అదుపులో పెట్టుకుని పొదుపుగా వినియోగించకపోతే వచ్చే ఫలితం ఏమిటో ఇప్పుడు ఏపీలో మంత్రిగా ఉన్న మాజీ కాంగ్రెస్ నేత పితాని సత్యనారాయణకు తెలిసివచ్చింది. మనం మంత్రిగా ఉన్నాం కదా.. ఏం మాట్లాడినా చెల్లుతుందిలే అనుకుంటే అది పొరపాటే నని తాజా ఉదంతం కళ్లకు కట్టింది. నిన్నటికి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో మాటల మంటలు రేపుతున్నాయి. పితానిపై నిప్పులు వర్షం కురిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజవకర్గం నుంచి 2014లో గెలుపు గుర్రం ఎక్కిన పితాని.. తాజాగా పవన్పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఎవరో తనకు తెలియదని, ఆయన గురించి పెద్దగా మేం(టీడీపీ నేతలు) చర్చించాల్సిన అవసరం పనికూడా లేదని కామెంట్ చేశారు. అంతేకాకుండా అసలు ఆయన పార్టీ ఉందా? అనే కోణంలోనూ వివాదాస్పద ప్రశ్నలు వేశారు. అంతే!! ఇంకేముంది పవన్ అభిమానులు నిప్పులు చెరిగారు. 2014లో పవన్ ప్రచారంతోనే చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచి.. అప్పట్లో పవన్కి దండాలు దస్కాలు పెట్టిన నువ్వు.. ఇప్పుడు పవన్ అంటే ఎవరని ప్రశ్నిస్తావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లను కుమ్మరించారు.
ఇక, ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం బహిరంగంగానే మంత్రులు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పవన్పై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆయన అన్నారు. ఏదైనా ఉంటే పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. ఇక, తనంటే ఎవరో తెలియదని కామెంట్లు చేసిన ప్రస్తుత మంత్రి పితాని, గతంలో కామెంట్ చేసిన కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజులను ఉద్దేశించి పవన్ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. నేనంటే తెలియదని అంటున్నారు మంచిది! అంటూ ఆయన చేసిన కామెంట్ ఇద్దరినీ మెత్తగా కొట్టినట్టే అనిపిస్తోందని అంటున్నారు పవన్ అభిమానులు. సో.. ఏదేమైనా.. నేతలు తమ నోటిని అదుపులో పెట్టుకోకపోతే.. కష్టమే!!