ఉభయ తెలుగురాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ, అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజానీకం హైదరాబాద్ ను రాజధానిగా అనుభవించవలసిన తమకున్న ఒక దశాబ్ధపు (అవసరమై పొడిగించవలసి వస్తే మరో ఐదేళ్ళు) హక్కులను సర్వం వదిలేసుకోవటానికి కారణమైన "ఓటుకు నోటు" కేసు విచారణకు సి.బి.ఐ కి ఒపాగించాలా లేదా అనేదాన్ని పరిశీలించడానికి అంగీకరించింది. "దీంతో ఓటుకు నోటు కేసు" చేవ వున్నట్లే అందుకే ఈ కేసు మరో కీలక మలుపు తిరిగినట్లే నని భావించవచ్చు.
ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అందుకు తగిన సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమవడమే కాకుండా తదుపరి దర్యాప్తును ఆపేసిందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) లో నివేదించారు. కేసులో అత్యంత ప్రభావశీలురు నిందితులుగా ఉన్నందున దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ప్రధాన పిటిషన్కు జత చేసి రెండూ కలిపి విచారిస్తామని పేర్కొంది. ఎమ్మెల్యే ఆళ్ల తరఫున న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, టి.విజయ భాస్కర్రెడ్డి పిటిషన్ను ధర్మాసనం దృష్టికి నివేదించారు.
ఈ పిల్ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, టి-టీడీపీ (ఇప్పుడు టి-కాంగ్రెస్) శాసన సభ్యుడు ఎ.రేవంత్రెడ్డి, బిషప్ హారీ సెబాస్టియన్, రుద్ర ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం లను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం, "ఈ కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి అప్పగించేలా ఆదేశించండి. ఓటుకు నోటు" కేసును దర్యాప్తు చేయడంలో ఏసీబీ తొలి నుంచీ విఫలమౌతూ వస్తుంది. ఈ కేసులో ఏ-1 గా ఉన్న నిందితుడు ఒక శాసన సభ్యుడు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్య్క్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. వీరిద్దరూ కేసును ప్రభావితం చెయ్యగల వారే. అందుకే వీరు తెలంగాణ ఏసీబీ ని ప్రభావితం చేయగలిగారు. దర్యాప్తు తొలిరోజుల్లో ఈ కేసులో అనేక సాక్ష్యాలు దొరికినా ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని తదుపరి చార్జ్-షీట్లో చేర్చలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలయిన సి.బి.ఐ తో ఈ కేసును దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే రెండు రాష్ట్రాల్లో పలుకుబడి కలిగిన ఈ నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంది. మరోవైపు నిందితులు సాక్ష్యాధారాలను లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు" అని పిటిషన్లో పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసు లో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల దాఖలు చేసిన "క్రిమినల్ అప్పీలు" పిటిషన్ను లోతుగా విచారిస్తామని 06.03.2017న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజా రిట్ పిటిషన్ను ఈ క్రిమినల్ అప్పీలుకు జత చేస్తూ సోమ వారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు పిటిషన్లు కలిపి విచారిస్తామని పేర్కొంది.
అయితే రాజకీయనాయకులపై కేసులు సత్వరవిచారణ జరపాలన్న సుప్రీం నిర్ణయం, దానికితోడు ఎన్నికలలో పోటీచేసే వారు నేరస్తులైన పక్షంలో వారిని ఎన్నికల్లో ఒక జీవితకాల నిషేధం అనే ఎన్నికల కమీషన్ అభ్యర్ధన, చట్టమైతే ఈ కేసు లోని ప్రజాప్రతినిదులు దోషులని తేలితే రాజకీయంగా కష్టాలు ఎదురౌతున్నట్లేనని న్యాయపండితు లు చెపుతున్నారు.