దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు తీవ్ర స్థాయిలో అవుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఘోర రోడ్డు ప్రమాదాలు జరగడం అమాయకులు బలైపోవడం జరుగుతుంది. తాజాగా పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నిల్చొని ఉన్న విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. భటిండా జిల్లాలోని బుచోమండి పట్టన శివారులో అప్పుడే బస్సు దిగి మరో బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు.
అంతలోనే మృత్యురూపంలో దాపురించింది ఓ ట్రక్కు..ఆ విద్యార్థుల మీద నుంచి వెళ్లింది. ఈ ఘటనలో 9 మంది విద్యార్థులు లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అదికారులు సహాయకు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం పది గంటలైన పొగమంచు వీడకపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా డ్రైవర్ కి ఏం కనపడక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.