వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోను నాయకుల వేట అప్పుడే మొదలైపోయింది. ఎవరెవరు ఏయే సీట్లనుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారో ? ఆ సీట్లపై ఇప్పటి నుంచే ఖర్చీఫ్లు వేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో కీలక ఎంపీ సీట్లలో ఒకటి అయిన రాజమండ్రి ఎంపీ సీటుకు అధికార టీడీపీలో గట్టిపోటీ నెలకొంది. ఇక్కడ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా మాగంటి మురళీమోహన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకుని తన కోడలు రూపాదేవికి టిక్కెట్ ఇప్పించుకోవాలని ఆయన అనుకున్నారు. అయితే చంద్రబాబు మాగంటికి టీటీడీ చైర్మన్ ఇవ్వకపోవడంతో పాటు ఆయన కోడలికి కూడా సీటు ఇచ్చేది లేదని చెప్పడంతో ఇప్పుడు ఆయనే ఇక్కడ నుంచి పోటీ చేస్తానని చెపుతున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీలో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు అవంతి ఫీడ్స్ అధినేత అల్లూరి ఇంద్రకుమార్, తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ బలుసు శ్రీనివాసరావు (బీఎస్ఆర్) ప్రముఖంగా పోటీపడుతున్నారు. అయితే వీరిలో నిన్నటి వరకు ఇంద్రకుమార్ పేరు ప్రముఖంగా వినిపించినా ఇప్పుడు బీఎస్ఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బెంగళూరు కేంద్రంగా భారీ ఎత్తున కాంట్రాక్టులు చేస్తోన్న ఆయన గత ఎన్నికల్లో బాబుకు భారీగా ఆర్థికసాయం చేసినట్టు టాక్?
దీంతో చంద్రబాబు బీఎస్ఆర్ను ఆర్థికంగా వచ్చే ఎన్నికల్లో మరింతగా ఉపయోగించుకోవడంతో పాటు ఆయనకు రాజమండ్రి సీటు ఇవ్వాలని దాదాపుగా డెసిషన్ తీసేసుకున్నట్టే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్కు షాక్ తప్పదంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకుని రాజమండ్రి నుంచి తన కోడలిని రంగంలోకి దించాలని ముందుగా అనుకున్న మురళీమోహన్ ఇప్పుడు అసలు తన ఫ్యామిలీకి సీటే రాదని టాక్ రావడంతో రాజమండ్రి నుంచే వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని కొత్తపల్లవి అందుకున్నట్టు తెలుస్తోంది. మురళీమోహన్ ప్రయత్నాలు ఎలా ఉన్నా టీడీపీ అధిష్టాన వర్గంలో కూడా రాజమండ్రి ఎంపీ సీటు బీఎస్ఆర్కే అన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి.