రాజకీయ అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి తన చాణక్యనీతిని బయట పెట్టుకున్నారు. తానే రాయి వేసి రేపిన గాయాన్ని.. ఎదుటివాళ్లే తగ్గించుకోవాలని నీతులు చెప్పారు. విషయంలోకి వెళ్తే.. ఇటీవల ప్యారడైజ్ పేపర్స్ పేరుతో మన దేశంలోని కొందరు ప్రముఖులు విదేశాల్లో డబ్బులు దాచుకున్నారని, పెట్టుబడులు కూడా పెట్టారని కథనాలు వచ్చాయి. వీటిలో అమితాబ్ బచ్చన్ సహా అనేక మంది ప్రముఖుల పేర్లు వెల్లడయ్యాయి. అదేసమయంలో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా వచ్చింది. ఇక,ఈ కథనాలు వెలుగు చూసిన రోజునే యాదృచ్ఛికంగా జగన్ తన పాదయాత్రను స్టార్ట్ చేశారు.
పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నించిన చంద్రబాబుకు ప్యారడైజ్ పేపర్లో జగన్ విషయం వెలుగు చూడడం అందిన అవకాశం గా లభించింది. దీంతో హుటాహుటిన ప్రెస్మీట్ పెట్టి మరీ జగన్ను కడిగిపారేశారు. ఇలాంటి నేతా సీఎం కావాలని అనుకునేది అని విజృంభించారు. విదేశాల్లోనూ ఎన్ని వందల, లక్షల కోట్లు దాచోడో అంటూ తన పరివారాన్ని సైతం ఉసిగొల్పారు బాబు. ఇక, ఇంకేముంది జగన్పై యనమల, కేఈ, సోమిరెడ్డి, వర్ల రామయ్య వంటివారు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. బాబు కూడా విదేశీ సొమ్ముపై విచారణ జరుగుతుందో లేదో తెలియదు కానీ, రాష్ట్రం నుంచి దోచుకున్న సొమ్మును వసూలు చేసి ప్రజలకు పంచుతానని శపథం చేశారు.
అయితే, బాబు కామెంట్లపై రెండో రోజు పాదయాత్రలో జగన్ నిప్పులు చెరిగారు. తనకు విదేశాల్లో ఆస్తులు కానీ, వ్యాపారాలు కానీ, నగదు కానీ ఉందని బాబు నిరూపించాలని డిమాండ్ చేశారు. దీనికిగాను ఆయనకు 15 రోజుల సమయం ఇచ్చారు. ఈ గడువులోగా చంద్రబాబు స్పందించాలని, ఆయా ఆరోపణలను రుజువులతో సహా నిరూపించాలని జగన్ అన్నారు. అలా నిరూపిస్తే.. తక్షణం తాను తన పార్టీ జెండీ పీకేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. ఒకవేళ నిరూపించకపోతే.. బాబు తన సీఎం సీటుకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు, సవాళ్లు రాజకీయంగా పెను దుమారం రేపాయి. దీనిపై బాబు ఎలా స్పందిస్తారోనని రాజకీయ విమర్శకులు సైతం ఎదురు చూశారు.
ఇక, ఎట్టకేలకు బాబు.. జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. అయితే, ఈ క్రమంలోనే తన రాజకీయ చాణక్యాన్ని బయట పెట్టుకున్నారు. జగన్ తనపై వచ్చిన ఆరోపణలను తప్పుకాదని తానే నిరూపించుకోవాలని ఓ అద్భుతమైన సూచన చేశారు. అంతేకాదు, జగన్ ఊరావాడా తప్పుల మీద తప్పులు చేసి, జనాల్ని దోచుకుని వాటిని నన్ను నిరూపించమంటే ఎలా అని వెరైటీ కామెంట్ చేశారు. అంతేకాదు, జగన్ ఈ దేశంలో దోచుకున్న సంపదను కక్కిస్తామని, ప్రజలకు పంచుతామని అన్నారు. మొత్తానికి బాబు ఇలా జగన్ సవాల్ నుంచి భలేగా ఎస్కేప్ అయిపోయారు. ఇక, జగన్ సవాల్ పాదయాత్రలో కలిసిపోయినట్టే అని అంటున్నారు విశ్లేషకులు. సో.. ఇది బాబు మార్కు రాజకీయం!!