ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర ప్రారంభించిన వైసీపీ అధినేత జగన్ ప్రజల్లో సానుభూతి సంపాదించాలని చూస్తున్నారు. మరోవైపు ఆయన సంకల్ప యాత్రపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా డీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు పొద్దున్న లేచినప్పటి నుంచి చంద్రబాబును విమర్శించడమే పని అని మండిపడ్డారు.
ఒక పార్టీ అధినేతగా ప్రజల్లో సానుభూతి సంపాదించాలని చూడటం పొరపాటు కాదు..కానీ అదే పనిగా అధికారంలో ఉన్న నేతలపై విమర్శలు చేయడం..ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఆయన ఉనికికే ప్రమాదం అని అన్నారు. కరువుసీమ రాయలసీమకు చంద్రబాబు నీరు ఇస్తుంటే... రాయలసీమకు నీరు ఎలా ఇస్తారని, పల్నాడుకు ఇవ్వాలనే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్ల కోసం పుట్టిన గడ్డకు కూడా అన్యాయం చేసేందుకు జగన్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. జగన్ దృష్టి అంతా సీఎం పదవి మీదే ఉందని చెప్పారు.జగన్ కు పోయే కాలం దగ్గరపడిందని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప నాయకుడని, పరిపాలనా దక్షుడని జేసీ కొనియాడారు.
తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అనేక విషయాల్లో చంద్రబాబుతో ఏకీభవించానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకు నీరు ఇస్తూ సస్యశ్యామలం చేస్తున్నారని అలాంటి నేతను విమర్శిస్తే...పుట్టగతులు ఉండవని అన్నారు.