వేములవాడ టిఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రావు కు మరోసారి దిమ్మతిరిగే షాక్ తగిలింది. గతంలో జర్మనీ పౌరుడైన చెన్నమనేని రమేష్ కు ఉన్న భారత పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్ర హోం శాఖ ఈ విషయాన్ని గతంలో ప్రకటించింది. ఆయన భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2017 ఆగస్టు 31న ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మూడుసార్లు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా మూడోసారి కూడా భారతీయ పౌరుడు కాదని హోం శాఖ తేల్చి చెప్పింది.
ఈయన భారత పౌరుడు కాదని గతంలో హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అయితే, భారత పౌరసత్వం సంపాదించారు. దీనికి తప్పుడు ప్రతాలు వాడారన్నది ఆభియోగం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర సర్కారు చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది.రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయాన్ని హైకోర్టులో చాలెంజ్ చేశారు చెన్నమనేని.
కాగా, హైకోర్టు, కేంద్ర హోం శాఖ చెప్పినా ఇంకా ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్నాడని బీజేపీ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెన్నమనేని రమేష్, 2014లో కూడా టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. వేములవాడ నుంచి చెన్నమనేని శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
అయితే ఎన్నికల నామినేషన్ సందర్భంగా చెన్నమనేని సమర్పించిన అఫిడవిట్లో భారత పౌరసత్వం లేదని స్పష్టమైంది. కేంద్ర హోం శాఖ తాజా ఉత్తర్వులతో చెన్నమనేని తన శాసన సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 13నే హోం శాఖలో చెన్నమనేని పౌరసత్వానికి సంబంధించిన విచారణ జరిగింది. అధికారికంగా ఆయన పౌరసత్వం చెల్లదని హోం శాఖ తాజాగా ప్రకటించింది.