ప్రతిష్ఠాత్మకమైన గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉందన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. గుజరాత్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుండగా.. హిమాచల్లో బీజేపీ గెలుపు ఖాయమైంది. ఈ ఉదయం పార్లమెంట్ కు వచ్చిన ఆయన ఫలితాలపై తన హర్షాన్ని తెలియజేస్తూ, విక్టరీ సంకేతాన్ని చూపించారు.
చిరు దరహాసంతో విజయ సంకేతాన్ని చూపుతూ పార్లమెంట్ లోపలికి వెళ్లారు.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. గుజరాత్ లో 14 జిల్లాల్లో బీజేపీ, 13 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్లో కాషాయ పార్టీ 41 స్థానాల్లో ఆధిక్యంలో నిలవగా రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గుజరాత్లోని 182 నియోజకవర్గ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లో 68 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
గుజరాత్లో బీజేపీ ఇప్పటివరకూ 5 స్థానాల్లో గెలుపొంది మరో 99 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆరు జిల్లాల్లో రెండు పార్టీల మధ్యా హోరాహోరీ పోరు సాగుతోంది. అహ్మదాబాద్, బనస్కంత, భావ్ నగర్, చోటా ఉదయ్ పూర్, గాంధీనగర్, జామ్ నగర్, నవ్ సారీ, రాజ్ కోట్, సూరత్, వల్సాద్, అర్వలి, భరూచ్, వడోదర జిల్లాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇదే సమయంలో ఆనంద్, దంగ్స్, కచ్, మోర్టీ, పఠాన్, తాపి, అమ్రేలీ, ద్వారక, గిర్ సోమ్ నాథ్, జునాగఢ్, పంచమహల్, పోర్ బందర్, సబర్కంత జిల్లాల్లో కాంగ్రెస్ ముందంజలో సాగుతోంది.