ఏపీ సీఎం చంద్రబాబుకు త్వరలోనే పెద్ద రాజకీయ అగ్ని పరీక్షను ఎదుర్కొననున్నారు. గుజరాత్ ఫలితాలపై దేశమొత్తం ఎంత ఆసక్తితో వెయిట్ చేసిందో ? ఏపీ సీఎం చంద్రబాబు కూడా అంతే స్థాయిలో వెయిట్ చేశారు. ఏపీ అన్నా, చంద్రబాబు, టీడీపీ అన్నా మోడీ పూచికపుల్లలా తీసి పడేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రావాల్సిన నిధులు, అమరావతి నిర్మాణం, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు లాంటి అంశాల్లో ఏపీకి మోడీ చిల్లు పెడుతున్నాడు. ఏపీలో సామాన్య జనాలకు కూడా మోడీ అంటే తీవ్ర ఆగ్రహం కలుగుతోంది.
నిన్నమొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా ? వద్దా ? అన్న అంశంపై సీఎం చంద్రబాబు డైలమాలోనే ఉన్నారు. ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే బాబు బీజేపీకి బైబై చెప్పేసి పవన్తో జట్టు కడతారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే గుజరాత్లో బీజేపీ ఓడిపోతే చంద్రబాబు గ్యారెంటీకి ఆ పార్టీని వదిలించుకునే ఆలోచన చేసి ఉండేవారేమో. గుజరాత్తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించింది. హిమాచల్లో అయితే బీజేపీకి మూడింట రెండు వంతుల మెజార్టీ వచ్చింది. 2019 ఎన్నికలకు సెమీఫైనల్స్గా భారత రాజకీయ వర్గాలు అంచనా వేసిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీయే గెలుస్తుందన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి.
ఇప్పుడు చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా ? లేదా పవన్తో నడవాలా ? అన్నది తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నట్టే. బీజేపీతో కలిసి వెళ్లకపోతే ఆ తర్వాత మోడీ ఏపీని, బాబును, టీడీపీని మరింత టార్గెట్ చేయొచ్చు. అది ఏపీ అభివృద్ధి మీద కొంతవరకు ప్రభావం చూపుతుంది. అదే బీజేపీతో కలిసి వెళితే పవన్ ఒంటరిగా పోటీ చేయడం ఖాయం. పవన్ బీజేపీతో కలిసే ఛాన్సే లేదు. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల చీలికతో ఎక్కడ టీడీపీకి ఎఫెక్ట్ 2009 పరిణామాలు పునరావృతం అవుతాయో ? అన్న టెన్షన్ బాబులో ఉంది.
ఏపీలో బాబు భారీగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే అటు జంపింగ్లకు, అటు బీజేపీ వాళ్లకు సీట్లు ఇవ్వడం పెద్ద సవాలే. ఇదే బాబుకు పెద్ద తలనొప్పి అనుకుంటే అసలు బీజేపీతో కలిసి వెళ్లాలా ? పపవన్తో కలిసి నడవాలా ? అన్నది తేల్చుకోలేకపోతున్నారు.
బీజేపీ ఈ సారి గతంలో ఇచ్చిన సీట్లు కన్నా రెట్టింపు సీట్లు అడుగుతుంనడంలో డౌటే లేదు. మరో వైపు వైసీపీ నుంచి బీజేపీకి భారీ ఆఫర్లు వెళుతున్నాయన్న గుసగుసలు కూడా ఉన్నాయి. పోనీ అటు బీజేపీని, ఇటు జనసేనను కాదని ఒంటరిగా బరిలోకి దిగే సాహసం కూడా చేసే పరిస్థితి లేదు. దీంతో చంద్రబాబుకు 2019 ఎన్నికలు పెద్ద అగ్నిపరీక్షగా మారాయనడంలో సందేహం లేదు.