సానుభూతితో ఎన్నికల ను ప్రభావితం చేయటం ఎన్నికల నియమావళి ప్రకారం నేరం. అయితే పోలింగ్ తేదీకి సరిగ్గా ఒక్కరోజు ముందు జయలలిత ఆస్పత్రి వీడియో విడుదల కావడంపై ఎన్నికల కమీషన్ చాలా సీరియస్ గా వుంది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఇప్పటికే ఆర్కె నగర్ పోలీసులకు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలొచ్చేశాయి.
ఈ వీడియో విడుదల చేసిన టీటీవీ వర్గం ఎమ్మెల్యే వెట్రివేల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు రావొచ్చని ఈసీ భావిస్తోంది. ఈ వీడియో ప్రసారాన్ని నిలుపు దల చేయాల్సిందిగా అన్ని వార్తా ఛానెల్స్ కి ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 126బీ ప్రకారం ఈ తరహా వీడియో ప్రసారం చట్టవిరుద్ధం అవుతుందని హెచ్చరించింది ఎన్నికల సంఘం. వీడియో విడుదల చేసిన వెట్రివేల్, పురచ్చి తలైవికి వీరాభిమాని మాత్రమే కాదు దినకరన్ వర్గంలో కీలక నేత. 2011లో ఇదే ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2015లో జయలలిత కోసం రాజీనామా చేసి సీటును ఖాళీ చేశారు.
సానుభూతిని మూటగట్టుకోవడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారన్న అభియోగం మీద ఎన్నికల సంఘం "ఎన్నికని రద్దు చేసే యోచన" లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి పక్ష డీఎంకే ఇప్పటికే, డబ్బు పంపకంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి ఈసీ అధికారులు కొన్ని ఆధారాల్ని కూడా సేకరించారు. ఒక్కో ఓటుకు అన్నాడీఎంకే 8 వేలు, దినకరన్ 6 వేలు, డీఎంకె 3 వేలు పంచుతునున్నారన్నది ఒక బహిరంగ రహస్యం. ఈ పరిస్థితుల్లో, ఆర్కే నగర్ ఉపఎన్నిక నిర్వహణ మీద అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే టిటివి దినకరన్ డబ్బు పంపిణీ కారణంగా ఆర్కే నగర్ ఉపఎన్నిక ఒకసారి వాయిదా పడింది.