పటియాలా హౌజ్ సి బి ఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో నస్టపోయిన వ్యక్తులు వ్యవస్థలు స్పందించి భారత మరియు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో నష్టపరిహారం కోసం సవాల్ చేస్తే భారత్ ధారుణ ఆర్ధిక నష్ట భారాన్ని మోయవలసి వస్తుంది. ఈ కేసు కాంగ్రెస్ పాలనా కాలం లోనే పురుడుపోసుకొని చివరకు చార్జ్ షీట్ వరకు కాంగ్రెస్ కాలంలోనే అడుగులు వేసింది. చివరకు తీర్పు ఇన్నాళ్ళకు అంటే దాదాపు ఒక దశాబ్ధం తరవాత వచ్చింది వస్తూ మొత్తం కేసే ఊహాజనితమన్నంత వరకు వెళ్ళింది. అయితే దాని పూర్వాపరాలు పరిశీలిస్తే:
సిబిఐ ప్రత్యేక కోర్టు 2జీ-స్పెక్ట్రమ్ కేసు అంతా ఉహాజనితం అని, ఇందులో అసలు కుంభకోణం జరిగినట్టే ఆధారాలు లేవని తీర్పు చెప్పి మొత్తం నిందితులు 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. అయినా ఈ కేసును ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసైనా పకడ్బందీగా నడిపించాలి. అలా ఈ కేసు కనుక కొనసాగకపోతే దాని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా పెద్ద భారాన్ని మోయాల్సి వస్తుంది. “2జి స్పెక్ట్రం కేస్ తీర్పు” వల్ల రానున్న నష్టపరిహాల భారం అసలు స్కాం భారం కంటే అధికం కేసులో అప్పటి టెలికాం సహాయ మంత్రి రాజా పదిహేను మాసాలు, ఎంపీ కనిమొళి ఆరు మాసాలు జైలు జీవితం గడిపారు.
ఇప్పడు అభియోగాలపై ఆధారాలే లేనందున అందరినీ నిర్దోషులుగా సీబీఐ కోర్టు ప్రకటించింది. దీంతో 2జీ కుంభకోణం కేసు లో అభియోగాలు ఎదుర్కొన్న వారితోపాటు, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా టెలికం లైసెన్స్ లు కోల్పోయిన కంపెనీలు నష్ట పరిహారం కోరే అవకాశాలు ఉన్నాయి. టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్ ట్రిబ్యునల్కు (టీడీ శాట్) లేదా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ను ఇవి ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు.
లూప్ టెలికం కంపెనీ తాను దేశవ్యాప్త లైసెన్స్ కోసం చెల్లించిన రూ. 1,658 కోట్లను తిరిగి చెల్లించాలని కోరుతూ 2012లోనే టీడీ శాట్ను ఆశ్రయించింది. 22 టెలికం సర్కిళ్లకూ కలిపి దేశవ్యాప్త లైసెన్స్ ఫీజు రూ. 1,658 కోట్లు అని, ఈ ఫీజుతోపాటు లైసెన్స్ రద్దు వలన తమ ప్రతిష్టకు జరిగిన నష్టానికి గాను మరో రూ. 1,000 కోట్లు కూడా ఇప్పించాలని లూప్ టెలికం డిమాండ్ చేసింది. అయితే ఈ వాదనను టీడీ శాట్ కొట్టేసింది. ‘మీపై నేరపూరిత విచారణ’ పెండింగ్లో ఉందని అప్పట్లో టీడీశాట్ అప్పుడు పేర్కొంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారినందున, సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్చిట్ ఇచ్చినందున ఈ సంస్థ మరోసారి పరిహారం కోసం డిమాండ్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
విదేశీ టెలికం సంస్థలైన టెలినార్, ఎతిసలాట్, లూప్ టెలికంలో ఇన్వెస్ట్ చేసిన విదేశీ సంస్థలు కూడా పరిహారం కోసం లోగడ ప్రయత్నాలు చేశాయని, అవన్నీ ఇప్పుడు మరోసారి ఆ ప్రక్రియను ప్రారంభిస్తాయని న్యాయ నిపుణులు అంటున్నారు. టెలికం కార్యకలాపాల కోసం పెట్టుబడులు పెట్టిన సంస్థలు గడువు ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించలేకపోయినందున ప్రభుత్వానికి చెల్లించిన పెనాల్టీలతోపాటు పరిహారంకూడా చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
భారత్లో టెలికం వ్యాపారంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన టెలినార్ గతంలోనే కేంద్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది. 1.4 బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని నోటీసు ఇచ్చింది. అయితే రద్దయిన స్పెక్ట్రమ్ కోసం చేసిన చెల్లింపులను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించడంతో ఆ నోటీసును వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత టెలినార్ పలు సర్కిళ్లలో మళ్లీ లైసెన్స్లు దక్కించుకుంది. చివరికి తన వ్యాపారాన్ని మరో సంస్థకి అమ్మేసిన టెలినార్ భారత్లో వ్యాపారం కారణంగా రూ.10,000 కోట్లను నష్టం కింద రద్దు చేసుకుంది.
అలాగే, లూప్ టెలికంలో పెట్టుబడులు పెట్టిన ఖైతాన్ హోల్డింగ్స్ 2జీ లైసెన్స్లను రద్దు చేసిన కారణంగా తమకు 2.5 బిలియన్ డాలర్లను చెల్లించాలని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించింది. అయితే ఈ పరిహారాలన్నీ తుది తీర్పు తర్వాతే వర్తిస్తాయి. కాబట్టి 2జి కేసును ప్రభుత్వం హైకోర్టులో, అవసరం అయితే ఆపైన సుప్రీం కోర్టులో కూడా కొనసాగించి తీరాల్సిందే.
ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని ఇప్పటికే నిర్ణయించింది. కోర్టులో వివాదం ఉంది కనుక, కంపెనీలు దేశంలో వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచు కుంటాయి కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవి పరిహారాల్ని మళ్ళీ డిమాండ్ చేసే అవకాశం లేదని భావిస్తు న్నారు. ఐదేళ్ల క్రితం సుప్రీంకోర్టు 122 లైసెన్స్లను రద్దు చేసిన నేపథ్యంలో తాజాగా సీబీఐ కోర్టు తీర్పులో ఆ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని కొందరు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కూడా న్యాయపోరాటంలో కేంద్రానికి కలిసివచ్చే అంశం అని చెబుతున్నారు.