"పూజ పూర్తయింది.
కొబ్బరికాయలిచ్చిన భక్తులకు తిరుగు అరచిప్పల వితరణ జరుగుతోంది.
'పెద్ద కొబ్బరికాయిచ్చిందెవరూ'?
- పూజారి ప్రశ్న.
నేను, నేను,నేనే,నేనూ...
'అది కుళ్లి పోయింది మరి'
- నాది కాదు,
నేనీలేదు, దూరంనుంచి సరిగా కనపడలేదు, నాదనుకున్నా, కాదు, కాదు...ఇదీ ఇటీవల వాట్సాప్ లలో జోరుగా రౌండ్లు వేసిన జోక్..అవును మరి 'విజయానికి అందరూ తండ్రులే.
పాపం పరాజయమే అనాథ'.
ఇప్పుడు ఏపీలో సీఎం చంద్రబాబు సర్కారు ఐఏఎస్ అధికారుల విషయంలో ఇలాగే ప్రవర్తిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. చంద్రబాబు సర్కారు తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. తాను సాధించిన విజయలను బాగా ప్రమోట్ చేసుకోవాలి.. సాధించలేకపోయిన అంశాలకు తగిన వివరణ రెడీ చేసుకోవాలి.. ఇదీ ఆ ప్లాన్ వ్యూహం.
అందులో భాగంగానే.. వైఫల్యాలకు ఐఏఎస్ అధికారులను చంద్రబాబు బాధ్యులను చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఐఏఎస్ అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని ఓ ప్రముఖ పత్రిక బ్యానర్ కథనం ప్రచురించింది. ఆ పత్రికతో చంద్రబాబుకు దీర్ఘకాల అనుబంధం ఉందన్న విమర్శల నేపథ్యంలో అది చంద్రబాబు సర్కారును కాపాడేందుకు ప్రచురించిన కథనమే అన్న భావన నెలకొంది. చంద్రబాబు బాగా కష్టపడుతున్నారని.. కానీ ఐఏఎస్ అధికారులు సహకరించడం లేదని.. అందుకే కొన్ని రంగాల్లో ఫెయిలయ్యామని సదరు కథనం సారాంశం.
అంటే బాబు రైట్.. కానీ ఐఏఎస్ లే రాంగ్ అని.. కానీ వాస్తవానికి సీఎం అంటే చెప్పి చేయించుకోవడమే కానీ.. చేయడం కాదు కదా.. మరి సీనియర్ ఐఏఎస్ లతో సరిగ్గా పనిచేయించుకోకపోవడం కూడా సీఎం వైఫల్యం కాదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయాలకు తామే కారణం.. పరాజయాలు మాత్రం ఐఏఎస్ ల కారణంగా అన్న ప్రచారంతో టీడీపీ సర్కారు వారిని బలిపశువులుగా మారుస్తోందన్న వాదన బలపడుతోంది.