భారత నేవీ మాజీ అధికారి అయిన కుల్భూషణ్ జాదవ్ను గూఢచర్య ఆరోపణలపై పాక్ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్లో మరణశిక్ష విధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో పాక్ వెనక్కి తగ్గింది. భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అతడి ఉరిపై స్టే విధించింది. ఇక కుల్భూషణ్ జాదవ్ తల్లిపై పాక్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఎన్నో ఆంక్షల తర్వాత కుల్భూషణ్ను కలిసేందుకు ఆయన తల్లి అవంతి జాదవ్, భార్య చేతన్కుల్ జాదవ్లకు అనుమతి ఇచ్చిన పాక్ అక్కడ కూడా ఆంక్షలు విధించింది.
కుమారుడిని నేరుగా కలవకుండా గాజు తెర అడ్డంగా పెట్టింది.పాక్ అధికారుల సాక్షిగా అక్కడ మీడియా జాదవ్ కుటుంబీలపై వీరంగం చేసింది. ఒప్పంద నియమాల ప్రకారం మీడియాను అనుమతించరాదన్న నిబంధనను పాక్ అధికారులు తుంగలోకి తొక్కారు. వారిద్దరూ కారు వద్దకు వెళ్లేలోపే మీడియో చుట్టుముట్టి అనరాని మాటలతో వారిని మానసిక క్షోభకు గురిచేసింది. అవంతి జాదవ్ను 'హంతకుడి తల్లి' (ఖాతిల్ కా మా) అని సంబోధించింది. నీ హంతక తనయుడిని చూసిన తర్వాత నీకేమనిపించింది?' అని ఒక జర్నలిస్టు అవంతి జాదవ్ను కార్నర్ చేశారు.
చేతన్ కుల్ జాదవ్నూ పాక్ మీడియా విడిచిపెట్టలేదు. 'నీ భర్త వేలాది మంది అమాయకులైన పాకిస్థానీయులను ఊతకోత కోశాడు. దీనికి ఏమి సమాధానం చెబుతావు?' అని ఓ జర్నలిస్టు చేతన్కుల్ జాదవ్పై విద్వేషం కక్కాడు. దీంతో చాలాసేపు జాదవ్ కుటుంబీకులు నిస్సహాయంగా ఉన్నచోటే నిలబడిపోయారు.
పాక్ మీడియా కిరాతకం పై బయటకు వచ్చిన వీడియోలపై ఇప్పటికే భారత్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ మీడియా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వక్తం చేయగా, ఇదే అంశాన్ని పార్లమెంటులో విపక్షాలు లెవనెత్తి పాక్ దుర్నీతిని ఎంగకట్టనున్నాయి.