జయలలిత ప్రాతినిధ్యం వహించి ఆమె మరణానంతరం ఖాళీ అయిన అసెంబ్లీ స్థానం ఆర్ కే నగర్ ఉపఎన్నిక అప్పట్లో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.టిటివి దినకరన్,మధుసూధన్ ,మరుదు గణేష్ లతో పాటు తమిళ హీరో విశాల్,జయలలిత మేనకోడలు దీప కూడా ఈ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసారంటే ఈ ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకమో ఊహించవచ్చు.
గత సంవత్సరం డిసెంబర్ 21న ఈ ఉపఎన్నిక జరగగా డిసెంబర్ 24న ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ లోక్ సభ మరియు రాజ్య సభ్యుడైన టిటివి దినకరన్ ,అధికార పార్టీ నేత ఇ మధుసూధన్ పై 40,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇందులో బిజెపి అభ్యర్థి కారు నాగరాజన్ కంటే నోటా కి వచ్చిన ఓట్లే ఎక్కువ కావడం విశేషం.
ఆర్ కే నగర్ ఓటర్లు తమ ఓట్లను స్వతంత్ర అభ్యర్థికి అమ్ముకున్నారంటూ నటుడు కమల్ హాసన్ ఆరోపించారు. అంతేగాక దినకరన్ పేరును వెల్లడిపరచకుండా ఒక స్వతంత్ర అభ్యర్థి ఓటుకు 20,000 ను ,అధికార పార్టీ 6,000 ను ఓటర్లకు పంచిందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉపఎన్నిక ఫలితాలపై ఒక తమిళ పత్రికకు రాసిన వ్యాసంలో స్పందిస్తూ “మీరు ఏదైతే ఒక పని పని చేసి దాన్ని దాచిపెడతారో అది అసలైన అవినీతి,కానీ ఇది ప్రజాస్వామ్య పతనం .ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావడం తీవ్ర భాధకు గురిచేసే అంశం” అని పరోక్షంగా దినకరన్ పై ఆయన రాసుకొచ్చారు.దీనికి స్పందించిన దినకరన్ ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రచారం చేసి ఆర్ కే నగర్ ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీయకు,వాళ్ళు నిజాయితీతో నన్ను ఓట్లు వేసి గెలిపించారు అని ఘాటుగా ప్రత్యుత్తరమిచ్చారు కూడా.