ప్రమాదాలు ఎలా వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు..మనం ఎంత జాగ్రత్తలు పాటించినా..కొన్ని సార్లు జరిగే ప్రమాదాలను నివారంచలేం. ఆ మద్య ముంబాయి లో జరిగిన అగ్నిప్రమాదం మరువక ముందే బెంగుళూరు లోని ఓ రెస్టారెంట్ లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బెంగళూరులోని కైలాశ్పాల్య మార్కెట్లో చోటుచేసుకుంది. కుంబార సంఘ భవనం కింది అంతస్తులోని కైలాశ్ బార్లో సోమవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
దట్టమైన పొగను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో సజీవదహనమైన ఐదుగురు వ్యక్తులు బార్లో పనిచేసే వారిగా గుర్తించారు. ముంబయిలోని కమలమిల్స్లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే.
ఇది జరిగిన రెండు రోజుల్లోనే ముంబై మరోల్ ఏరియాలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు. బెంగుళూరు రెస్టారెంట్ ప్రమాద మృతుల్లో ముగ్గురు తుముకూరుకు చెందిన స్వామి (23), ప్రసాద్ (20), మహేశ్ (35)లుగానూ, హసన్కు చెందిన మంజునాథ్ (45), మండ్యాకు చెందిన కీర్తి (24)గా గుర్తించారు.
ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదని, దీనిపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం పగలు జరిగి ఉంటే పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని పోలీసులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.