ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు..ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారు. స్వరాష్ట్రంలోనే కాదు.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఎనలేని ఆదరణ పెరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ యాదవులు ఫిదా అయ్యారు. యాదవ సంక్షేమం కోసం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఏపీ యాదవ సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని యాదవ సామాజికవర్గానికి రాజ్యసభ టికెట్ ఇస్తానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నగర శివార్లలో యాదవ, కురవ భవన నిర్మాణానికి పది ఎకరాలు, రూ.10 కోట్లను ఆయన కేటాయించారు. యాదవులకు రాజ్యసభ, కురవలకు ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ భవిష్యత్తులో తమ సామాజికవర్గానికి అండగా నిలబడతారన్న ఉద్దేశంతోనే ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
యాదవుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అక్కడి యాదవ సోదరులు ప్రశంసలు కురిపించారు. గొల్లకుర్మలకు గొర్రెలు పంపిణీ చేయడం.. వారి సంక్షేమం కోసం 10 ఎకరాల స్థలంలో గొల్లకుర్మల సంక్షేమ భవన సముదాయానికి శంకుస్థానం చేయడం అద్భుతమని కొనియాడారు.
యాదవ యువభేరీ అధ్యక్షుడు లక్కనబోయిన వేణు, కొలుసు సతీష్ యాదవుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తానికి కేసీఆర్కు తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో కూడా పాలాభిషేకం ట్రెండ్ మొదలుకావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.