ఏపీ విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న విశాఖ రైల్వే జోన్ విషయం రాష్ట్రం విడిపోయి మూడున్నరేళ్లు పూర్తయినా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఎప్పటికప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగడం.. ఆ వెంటనే చప్పబడి పోవడం కామనైపోయింది. గత ఏడాది ఇదే సమయంలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఏకంగా దీనిపై రోడ్డెక్కారు. జోన్ విషయం తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. స్థానికంగా పెల్లుబికిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో రైల్వే జోన్పై అధికార పార్టీ ఎంపీ రోడ్డు మీదకు రావడం, ధర్నా చేయడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే, అప్పటికీ.. ఇప్పటికీ జోన్ విషయంలో ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి కనిపిస్తోంది.
మళ్లీ ఇప్పుడు తాజాగా 2018-19 కేంద్ర బడ్జెట్ విషయంపై అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఏపీ నుంచి కూడా ప్రతిపాదనలు పంపాలని ఇక్కడి అధికారులను పురమాయించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే జీఎం మన ఎంపీలతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా ఎంపీల నియోజకవర్గాలకు సంబంధించిన రైల్వే ప్రతిపాదనలు చెప్పాలని ఆయన కోరారు. ఈ క్రమంలో మరోసారి విశాఖ రైల్వే జోన్ విషయం తెరమీదకి వచ్చింది.
వాస్తవానికి కేంద్రంలోని బీజేపీ.. ఏపీ ప్రభుత్వంలోనూ మిత్ర పక్షంగా ఉంది. దీంతో బీజేపీ ఏదైనా చేయగలదని ఇక్కడి ప్రజలు, నేతలు కూడా భావించారు. కానీ, జోన్ విషయంలో ఎప్పటికప్పుడు ఇస్తాం.. చేస్తాం..! అంటున్నారే తప్ప అడుగు తీసి అడుగు వేసింది కనిపించడం లేదు.తాజాగా రైల్వే జీఎంతో జరిగిన సమావేశానికి టీడీపీ, వైసీపీ ఎంపీలు పాల్గొన్నారు. మూకుమ్మడిగా జోన్ విషయాన్ని ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే, ఈ విషయం తమ పరిధిలో లేదని, కేంద్రం పరిధిలో ఉందని జీఎం కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.
ఇక, దీనిపై ఏమన్నా మాట్లాడాలంటే .. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకోవడం మినహా చేయాల్సింది ఏమీ లేదని కూడా స్పష్టం చేశారు. అంటే.. మోడీ కరుణిస్తేనే.. ఏపీకి జోన్ వస్తుందని చెప్పకనే చెప్పారు. దీంతో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘రైల్వేజోన్ విషయంలో ఎంపీలు చేసేది ఏమీ లేదు..., మేం చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి... దించమంటే దించాలి’ అంటూ కామెంట్లు కుమ్మరించారు.
రైల్వే జోన్పై చెప్పాల్సింది ప్రధాని మోడీయేనని అసలు విషయం బట్టబయలు చేశారు. సో.. మరి మోడీ కరుణిస్తేనే ఏపీకి రైల్వే జోన్ వస్తుందన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. కానీ, ఆయన పడనిచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఇటీవల ఏపీకి ప్రతిపాదించిన పెట్రోలియం వర్సిటీనే ఆయన పని గట్టుకుని గుజరాత్ పట్టుకుపోయారు.
దాదాపు 3500 మంది యువతకు ఉపాధి కల్పించే ఈ యూనివర్సిటీనే తరలించుకుపోయిన నేపథ్యంలో ఏపీపై ప్రత్యేకంగా ప్రేమ చూపుతాడనే నమ్మకం ఇప్పుడు మన ఎంపీలకు సైతం సన్నగిల్లింది. పోనీ.. సీఎం చంద్రబాబు ఏమన్నా.. కల్పించుకుంటే అవుతుందా? అంటే.. ఆయన కూడా గతంలో ఒకటికి నాలుగు మార్లు కేంద్రానికి విన్నవించారు. అయినా కూడా ఫలితం కనిపించలేదు. సో.. ఏదేమైనా జోన్ ఇక.. ప్రత్యేక హోదానే!!