ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉగ్రవాదులు విధ్వంసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే..అగ్ర దేశాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవించే పరిస్థితి నెలకొంది..ఎక్కడ ఎప్పుడు ఎలా ఉగ్రవాదులు విరుచుకు పడతారో తెలియదు..ఎలా మారణహోమం సృష్టిస్తారో అర్థం కాదు..ఇలా గత సంవత్సరం ఎన్నో సంఘటనలు జరిగాయి. అయితే ఉగ్రవాదులు భారత్ ని లక్ష్యంగా చేసుకొని ముఖ్యంగా రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు విధ్వంసాలకు ప్లాన్ వేస్తున్నట్లు ఇంటిలీజెన్స్ వర్గాలు తెలుపుతున్నాయి.
ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో లష్కరే తోయిబా ఉగ్రవాది కలకలం సృష్టించాడు. గుజరాత్ యాంటీ-టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్), ఢిల్లీ పోలీస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో వాంటెడ్ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో ఇతను నిందితుడు.
బిలాల్ అహ్మద్ కవా(37)ను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ వద్ద బుధవారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ నుంచి అతను వచ్చినట్లు గుజరాత్ ఏటీస్-స్పెషల్ సెల్ పోలీసులు వెల్లడించారు. హెడ్ క్వార్టర్స్కు అతన్ని తరలించిన అధికారులు ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే తన సోదరుడిని చూడటానికి ఢిల్లీకి వచ్చానని.. పోలీసులు అరోపిస్తున్నట్లు తనకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని కవా చెబుతున్నాడు.
డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. గణతంత్ర్య దినోత్సవ వేడుకలు దగ్గర పడుతుండటంతో మరోసారి ఏదైనా దాడులకు ఫ్లాన్ చేశారేమోనన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలర్ట్ ప్రకటించిన ఢిల్లీ పోలీసులు రద్దీ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.